రూ.కోటి 50 లక్షల వ్యయంతో
బీటీ, సీసీ రోడ్డు పనులు వేగిరం
పనులను పరిశీలిస్తున్న అధికారులు, ప్రజాప్రతినిధలు
సైదాబాద్, మే 26 : ఐఎస్ సదన్ డివిజన్ పరిధిలో అధ్వానంగా మారిన రోడ్లను అందంగా మార్చుతున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. ప్రజలు, వాహనదారులకు ఇబ్బందులు కలుగకుండా సుందరంగా తీర్చుదిద్దుతున్నారు. డివిజన్ పరిధిలో రూ.కోటి 50 లక్షల వ్యయంతో బీటీ, సీసీ రోడ్లకు కొత్త అందాలు తెచ్చే పనుల్లో అధికారులు నిమగ్నమయ్యారు. నిత్యం రద్దీగా ఉండే వినయ్ నగర్ – లక్ష్మి నగర్ కాలనీ బీటీ రోడ్డు సీఆర్ఎఫ్ఈ రోడ్ల అభివృద్ధి పనుల్లో భాగంగా అద్దంలా తయారుచేశారు.
త్వరలోనే మరికొన్ని రోడ్లకు ..
ఈస్ట్ వినయ్నగర్ కాలనీ రోడ్, బాలాజీ నగర్ రోడ్తో పాటు మరికొన్ని కాలనీల్లో అంతర్గత రోడ్ల నిర్మాణాల కోసం జీహెచ్ఎంసీ అధికారులు నిధులను కేటాయించి రోడ్ల వేసే పనుల్లో బిజీగా ఉన్నారు. కాలనీల్లో సమస్యాత్మక రోడ్లను గుర్తించి వాటి స్థానంలో కొత్త రోడ్లను వేయనున్నారు. ఇప్పటికే లక్ష్మి నగర్ కాలనీ పార్క్ లైన్ సీసీ రోడ్, కేశవ నగర్ కాలనీ సీసీ రోడ్డు నిర్మాణ పనులను పూర్తి చేశారు. డివిజన్ వ్యాప్తంగా పలు కాలనీల్లో అంతర్గత రోడ్లను గుర్తించి వాటి ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
కొత్త రోడ్ల కోసం ప్రతిపాదనలు పెట్టాం..
డివిజన్ వ్యాప్తంగా సమస్యలు ఉన్న రోడ్లను గుర్తించి ఇప్పటికే ప్రతిపాదనలు చేసి జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులకు పంపాం. కొన్ని కాలనీల్లో అంతర్గత రోడ్లు వేసే పక్రియ మొదలు పెట్టాం. కేశవ నగర్ కాలనీ, లక్ష్మి నగర్ కాలనీ పార్క్లైన్ సీసీ రోడ్లను పూర్తి చేశాం. వినయ్నగర్ కాలనీ – లక్ష్మి నగర్ కాలనీ ప్రధాన రోడ్ను సీఆర్ఏఫ్ స్కిం కింద రోడ్డును వేశాం. మిగతా కాలనీల్లో కూడా త్వరలోనే రోడ్లను అభివృద్ధి చేసి కాలనీవాసుల కష్టాలను తీర్చుతాం.
– జంగం శ్వేత , కార్పొరేటర్, ఐఎస్ సదన్ డివిజన్
అంతర్గత రోడ్లను గుర్తించి అభివృద్ధి పరుస్తాం..
కాలనీల్లో అధ్వానంగా ఉన్న రోడ్ల గుర్తించి వాటికి కొత్త అందాలను తెస్తున్నాం. అంతర్గత రోడ్లను గుర్తించి రోడ్ల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. వినయ్నగర్ కాలనీ – లక్ష్మి నగర్కాలనీ రోడ్ను సీఆర్ఏఫ్ఈ కింద నిధులతో రోడ్డును వేశాం. రోడ్ల నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలకు అధిక ప్రాధ్యానత ఇస్తున్నాం. అభివృద్ధి పనులను నిరంతరం పరిశీలన చేస్తూ, పర్యవేక్షణ కొనసాగిస్తున్నాం.
– మహ్మద్ అన్సారీ , ఈఈ, జీహెచ్ఎంసీ సంతోష్నగర్ సర్కిల్