మారేడ్పల్లి, ఏప్రిల్ 30 : పేద ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని, మాజీ సీఎం కేసీఆర్ ఆశీస్సులతో కంటోన్మెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మీ ముందుకు వచ్చానని.. తనను అత్యధిక మెజార్టీతో గెలిపించి అసెంబ్లీకి పంపించాలని బీఆర్ఎస్ అభ్యర్థి జి.నివేదిత ప్రజల్ని కోరారు. మంగళవారం మోండా డివిజన్ రైల్ నిలయం అంబేద్కర్నగర్ బస్తీలో మాజీ కార్పొరేటర్ ఆకుల రూప ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి నివేదిత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను ప్రజలకు వివరిస్తూ.. ఓటు వేయాలని అభ్యర్థించారు.
ఈ సందర్భంగా అభ్యర్థి జి.నివేదిత మాట్లాడుతూ.. ప్రజలకు మాయమాటలు చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పేద ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని తెలిపారు. ఆరు గ్యారెంటీలు అని హడావుడి చేశారు తప్ప వాటి అమలుపై దృష్టి సారించడం లేదని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీతో ప్రజలకు ఎలాంటి లాభం లేదని తెలిపారు. దివంగత ఎమ్మెల్యే జి.సాయన్న చేసిన అభివృద్ధి పనులు నేటికి ప్రజల ముందు ఉన్నాయన్నారు. అభివృద్ధి తమ నినాదం అని.. ఈ సారి ఎన్నికల్లో తనను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఆకుల హరికృష్ణ, జీహెచ్ఎంసీ మాజీ కో ఆప్షన్ సభ్యుడు సీఎన్.నర్సింహ ముదిరాజ్, చిన్న, సుజన్ ముదిరాజ్, వినయ్, నారాయణ, రాము, జోడి బ్రదర్స్, మహిళా నాయకులు కుమారి, అనిత, సువర్ణ, మాధురి, భవాని, తదితరులు పాల్గొన్నారు.