సిటీబ్యూరో, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ): రుణాలపై నిర్మాణ, మైనింగ్ రంగానికి చెందిన భారీ వాహనాలను కొనుగోలు చేసి, వాటిని అడ్డదారిలో విదేశాలకు తరలిస్తున్న ముఠాలపై సీసీఎస్ పోలీసులకు ఫైనాన్స్ సంస్థలు, బ్యాంకుల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి. మన రాష్ట్రంలోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఈ స్కామ్ జరుగుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మూడంచల్లో ఈ దందా నడుస్తున్నది. సముద్ర మార్గం నుంచి ఈ వాహనాలను ఆఫ్రికా దేశాలకు తరలిస్తున్నారు. ఈ మోసంపై సీసీఎస్ పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా దేశ వ్యాప్తంగా సరుకు రవాణా చేసే ఓడ రేవులలోని కస్టమ్స్ అధికారులకు లేఖలు రాసి ఎన్ని వాహనాలు విదేశాలకు ఎగుమతి అవుతున్నాయనే విషయాలు తెప్పించుకుంటున్నారు. ఇటీవల కొటక్ మహేంద్ర, తాజాగా హెచ్డీబీ ఫైనాన్స్ సంస్థలు సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. మరో ఫైనాన్స్ సంస్థ కూడా ఫిర్యాదు ఇవ్వడానికి సిద్ధమవుతున్నది.
స్కామ్ జరుగుతున్నదిలా..
రుణాలు ఎగ్గొట్టేస్తారు…!
మూడు నాలుగు నెలలు వాయిదాలు చెల్లిస్తారు. వాయిదాలు బ్యాంకులకు వస్తుండటంతో ఆయా వాహనాల గురించి అంతగా పట్టించుకోరు. ఒకవేళ అనుమానం ఉండి రుణం పొందిన వాళ్లను సంప్రదిస్తే, వాహనం ఇక్కడే ఉందని, వేరే వాళ్ల వద్ద పని నడుస్తుందంటూ నమ్మిస్తారు. వాహనం, యంత్రాలు ఎప్పుడైతే దేశం దాటిపోతాయో ఇక, వాయిదాల చెల్లింపు జరగదు. ఒకటి రెండు నెలలు వాయిదాలు రాకపోయే వరకు బ్యాంకు అధికారులు రంగంలోకి దిగి ఆరా తీసి అది స్కామ్గా గుర్తిస్తారు. ఇటీవల కొటక్ మహేంద్ర బ్యాంక్ నుంచి సీసీఎస్కు ఫిర్యాదు రాగా.. తాజాగా హెచ్డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ లీగల్ మేనేజర్ నాగేందర్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మరో కేసు నమోదైంది.
వనపర్తికి చెందిన కె.రవీందర్రెడ్డి, హయత్నగర్కు చెందిన హైటెక్ ఎర్త్ మూవర్ సర్వీసెస్, మేడ్చల్కు చెందిన మదాసు అసోసియేట్స్, బోడుప్పల్కు చెందిన స్వప్న, నాంపల్లికి చెందిన మహ్మద్ యాసీ అహ్మద్ తదితరులపై ఫిర్యాదు చేయడంతో సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉండగా.. కేవలం ఈ ఒక్క సంస్థ నుంచి 38 భారీ వాహనాలపై రుణాలు పొంది ఎగ్గొట్టినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ఇక్కడ వాహనానికి రూ.5లక్షల నుంచి రూ.10లక్షలు ఈ ముఠా ఖర్చు చేస్తున్నది. ఈ వాహనాలను ఆఫ్రికా దేశాల్లో రెట్టింపు ధరలకు విక్రయిస్తుంటారు. రుణాలతో వాహనాలను తీసుకునేది ఒక ముఠా, నంబర్లు ట్యాంపరింగ్ చేసి వాటిని పోర్టుల వరకు తరలించేది మరో ముఠా.. విదేశాల్లో ఉంటూ వాటిని విక్రయించేంది ఇంకో ముఠా. ఇలా మూడంచెల్లో ఈ మాఫియా పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.