ఉద్యమ నేత సీఎం కేసీఆర్ దేశరాజకీయాల్లోకి రావాలని దేశ వ్యాప్తంగా రోజురోజుకూ డిమాండ్ పెరుగుతున్నది. ఉద్యమాల ద్వారా సాధించిన తెలంగాణ రాష్ట్రంలో అతి తక్కువ కాలంలోనే అభివృద్ధి, సంక్షేమం ఉరకలేస్తున్నది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఉచిత కరెంటు, రైతు బంధు, రైతు బీమా, ఆసరా పింఛన్, కల్యాణ లక్ష్మి, దళిత బంధు తదితర పథకాలు విజయవంతంగా అమలు అవుతుండటంతో దేశ ప్రజల దృష్టి ఇప్పుడు తెలంగాణ వైపు మల్లింది. ఉద్యమ నేత దేశ రాజకీయాల్లోకి రావాలని, ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్న మోదీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని వేడుకుంటున్నారు. సీఎం కేసీఆర్ను జాతీయ రాజకీయాలను శాసించే స్థాయికి చేర్చితే తెలంగాణలో అందజేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశ వ్యాప్తంగా అమలవుతాయని, అందుకే సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావాలని వేడుకుంటున్నారు.
దేశాన్ని నడిపించే సత్తా కేసీఆర్కు ఉంది
సుపరిపాలనతో అభివృద్ధి పథంలో సమర్థవంతంగా భారతదేశాన్ని ముందుకు నడిపించే రాజనీతి కలిగిన నాయకుడు సీఎం కేసీఆర్. ప్రస్తుత పరిస్థితుల్లో కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టడం శుభపరిణామం. దేశంలో ఎక్కడాలేని విధంగా ఆసరా పెన్షన్, కల్యాణ లక్ష్మి, రైతు బంధు, దళిత బంధు, రైతులకు ఉచిత విద్యుత్, పరిశ్రమలకు కోతలు లేని విద్యుత్ అందజేస్తున్న ఘనత కేవలం సీఎం కేసీఆర్కే దక్కుతుంది. – పిల్లి తిరుపతి, పారిశ్రామిక వేత్త, బాలానగర్
అందరి దృష్టి తెలంగాణ వైపు..!
దేశానికి కేసీఆర్ నాయకత్వం ఎంతో అవసరం. తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలను ఏకతాటిపైకి తెచ్చి అభివృద్ధికి బాటలు వేసిన ఘనత కేసీఆర్కే దక్కింది. రాష్ర్టాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతూ అందరి దృష్టిని తెలంగాణ వైపు మలిపాడు. కేసీఆర్ లాంటి సమర్థవంతమైన నాయకుడి సేవలు దేశానికి అవసరం. – బుదురు ఆంజనేయులు, పారిశ్రామిక వేత్త, కొండాపూర్
దేశ రాజకీయాల్లోకి కేసీఆర్ రావాలి …
సీఎం కేసీఆర్ పరిపాలన దక్షతతో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచారు. దేశాన్ని కూడా ప్రగతి పథంలో నడిపిస్తారు. బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలతో దేశ ప్రజానీకం విసిగిపోయింది. పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ వంటి నిత్యవసర ధరలు పెంచి సామాన్యుల నడ్డి విరుస్తున్నారు.నల్లాధనాన్ని వెలికి తీస్తానన్న మోదీ, రిటైల్ రంగాన్ని అంబానీ, ఆదానీ వంటి కార్పొరేట్ సంస్థలకు అప్పగించి చిన్న వ్యాపారస్తులకు బతుకుదెరువు లేకుండా చేస్తున్నాడు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశ రాజకీయాల్లోకి కేసీఆర్ అడుగుపెడితే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుంది. – టి.వీరారెడ్డి,అల్లాపూర్
దేశమంతా సుభిక్షంగా ఉంటుంది
గొప్ప ఆలోచన వ్యక్తి సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళ్తే… దేశం సుభిక్షంగా ఉంటుంది. సమాజంలో బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచే నాయకుడు సీఎం కేసీఆర్. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో పేదలకు సంక్షేమ పథకాలను అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుంది. అన్ని సామాజిక వర్గాల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారు.గతంలో బడుగు,బలహీన వర్గాల ప్రజలను నాయకులు ఓటర్లుగానే చేశారు.దార్శనికుడైన సీఎం కేసీఆర్ వెనుక బడిన వర్గాలను ముందుకు నడిపిస్తూ సమసమాజ స్థాపన కోసం పనిచేయడం అభినందనీయం. ఇలాంటి గొప్ప ఆలోచన కలిగిన వ్యక్తి దేశ రాజకీయాల్లోకి వెళ్తే దేశమంతా సుభిక్షంగా ఉంటుంది. -రాపోలు సోమయ్య, తిరుమలగిరి(సామాజికవేత్త)
మతోన్మాద రాజకీయాలకు వ్యతిరేకం
అన్ని వర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా అమలు చేసి పేదలకు అందాలంటే సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలి. అదేవిధంగా మతోన్మాద రాజకీయాలకు వ్యతిరేకంగా సీఎం కేసీఆర్ దేశవ్యాప్తంగా పర్యటించాలి. – మహిపాల్రెడ్డి, ఏఎస్రావునగర్
దేశానికి దిక్సూచిగా..
సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వస్తే దేశానికి దిక్సూచిగా నిలుస్తారు. తెలంగాణలో పేదలకు అందుతున్న సంక్షేమ ఫలాలు దేశవ్యాప్తంగా ఆయా వర్గాలకు అందుతాయి. ఉపాధి పథకాలతో పేదరికం, నిరుద్యోగం తగ్గుతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వస్తే అన్ని సమస్యలు తీరుస్తారు.
– మహ్మద్ అసీమ్ అజాజ్, పారిశ్రామికవేత్త, జూబ్లీహిల్స్
ఉజ్వల భారత్ కేసీఆర్తోనే సాధ్యం
దేశ, ఆర్థిక, సామాజిక, రాజకీయ, వ్యవసాయ, రక్షణ, ఉపాధి తదితర అంశాలపై నిర్దిష్టమైన అవగాహన కలిగిన నాయకుడు సీఎం కేసీఆర్. తెలంగాణ సాధించిన ప్రగతిని చూసి.. ఇతర రాష్ర్టాల్లోని ప్రజలు కూడ ఇలాంటి అభివృద్ధినే కోరుకుంటున్నారు. కేసీఆర్ వంటి నాయకుడితోనే ఉజ్వల భారత్ సాధ్యమని భావిస్తున్నారు.
– డాక్టర్.కే.ఎస్.శంకర్ రావు, బొల్లారం
దేశ రాజకీయాల్లో ప్రక్షాళన జరుగాలంటే..
దేశ రాజకీయాల్లో ప్రక్షాళన జరుగాలంటే కేసీఆర్ జాతీయ రాజకీయల్లోకి రావాలి. తెలంగాణ ఉద్యమంతో ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఆయన చేసిన కృషి చాలా గొప్పది. తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోసం అహర్నిషలు పరితపించే నాయకుడు దేశ రాజకీయాల్లోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారు.
– సత్యనారాయణ, విద్యావేత్త, హుడాకాలనీ
విద్యలో విప్లవాత్మక మార్పులు
సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర విద్యావిధానంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. లక్షలాది మంది పేద విద్యార్థులకు అత్యంత నాణ్యమైన ఉచిత విద్యనందిస్తున్నారు. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వస్తే నూటికి నూరు శాతం పేద విద్యార్థులకు పూర్తిగా నాణ్యమైన ఉచిత విద్య అందుతుంది.దేశ భవిష్యత్ సైతం పూర్తిగా మారిపోతుంది.
– అయూబ్ ఖాన్, విద్యావేత్త, వెంకటగిరి
సంక్షేమ దేశంగా మారుస్తారు.!
సీఎం కేసీఆర్ రాష్ట్రంలో పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహిస్తున్నారు. టీఎస్ఐపాస్ ప్రవేశపెట్టడంతో పాటు పరిశ్రమలకు నిరంతరం విద్యుత్ను అందిస్తున్నారు. దేశ రాజకీయాల్లోకి సీఎం కేసీఆర్ రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సంక్షేమ దేశంగా తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలి.
– మంద సురేశ్కుమార్, చర్లపల్లి పారిశ్రామికవాడ సీఐఏ ఫేజ్-3 ఉపాధ్యాక్షుడు
విజన్ ఉన్న నాయకుడు కేసీఆర్
మోదీ నాయకత్వంలో ఆర్థిక వనరులన్నీ ఒక్కొక్కటిగా కార్పొరేట్ పరం అవుతున్న ఈ విపత్కర పరిస్థితుల్లో దేశానికి కేసీఆర్ సేవలు అవసరం. భారతదేశానికి కేసీఆర్లాంటి దృఢసకల్పం ఉన్న నాయకుడు కావాలి. ప్రాంతీయ పార్టీలను ఏకతాటిపైకి తెచ్చి దేశ రాజకీయాల్లో సమూల మార్పులు తీసుకురాగల సమర్ధుడు. కేసీఆర్ గొప్ప విజన్ ఉన్న నాయకుడు. తెలంగాణలో అమలు అవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా అమలు కావడంలేదు. ముఖ్యంగా దేశంలోని అన్ని ప్రాంతాల రైతులు కేసీఆర్ను స్వాగతిస్తారు. అతడి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు.
– నర్ర రామలింగారెడ్డి, ఈస్ట్ బాలాజీహిల్స్, తెలంగాణ తొలిదశ ఉద్యమకారుడు
సమ సమాజ స్థాపన కేసీఆర్తోనే సాధ్యం
రాష్ర్టాభివృద్ధికి సీఎం కేసీఆర్ ఎంతగానో పాటు పడుతున్నారు. వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు పింఛన్లు ఇస్తూ వారికి భరోసా కల్పిస్తున్నారు. దళిత బంధు, రైతు బంధు, షాదీముబారక్, కల్యాణ లక్ష్మి, సీఎం రిలీఫ్ ఫండ్ పథకాలతో పేదలకు అండగా నిలుస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్న సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వస్తే ఈ పథకాలన్నీ దేశం మొత్తం అమలవుతాయి. అప్పుడే దేశంలో సమ సమాజ స్థాపన సాధ్యపడుతుంది..
– కోలా రవీందర్ ముదిరాజ్, సామాజికవేత్త, జీడిమెట్ల
పారిశ్రామిక రంగానికి చేయూత
సీఎం కేసీఆర్ పారిశ్రామిక రంగానికి పూర్తి స్థాయిలో చేయూతనిస్తున్నారు. పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తూ నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేలా కృషి చేస్తున్నారు. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వస్తే జాతీయ, అంతర్జాతీయ స్థాయి సంస్థలు తరలివస్తాయి. దేశం పారిశ్రామిక రంగంలో నంబర్ వన్ స్థానంలో నిలుస్తుంది.
– కిరణ్కుమార్, గ్రిప్ స్ట్రాపింగ్ టెక్నాలజీస్, నూతన్కల్, మేడ్చల్ మండలం