సిటీబ్యూరో, జనవరి 10 (నమస్తే తెలంగాణ) : సంక్రాంతి పండగ నేపథ్యంలో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించడంతో నగర ప్రజలు సొంతూళ్లకు ప్రయాణమయ్యారు. ఎంజీబీఎస్, జేబీఎస్, పటాన్చెరువు, మియాపూర్, కూకట్పల్లి, ఎల్బీనగర్, ఉప్పల్ వంటి ప్రాంతాల్లో ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగింది. ప్రయాణికుల అవసరాల మేరకు బస్సులను ఏర్పాటు చేయడం ఆర్టీసీ అధికారులకు తలనొప్పిగా మారింది.
రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అమల్లోకి తెచ్చిన మహాలక్ష్మి పథకానికే ప్రస్తుతం ఉన్న బస్సులు సరిపోవడం లేదు. ఇప్పటికే నగరంలో తిరిగే 2700 మెట్రో ఎక్స్ప్రెస్లు, ఆర్డినరీలు మహిళా ప్రయాణికులతో ఓవర్ లోడ్ అవుతున్నాయి. పైగా నగరం నుంచి దాదాపు 4వేలకు పైగా సంక్రాంతి స్పెషల్స్ ఏర్పాటు చేస్తూ ఆర్టీసీ అధికారులు నిర్ణయం తీసుకున్నప్పటికీ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ఏ విధంగా కల్పించాలో అర్థం కాని పరిస్థితిల్లో తర్జన భర్జన పడుతున్నారు.