BRS | సికింద్రాబాద్, ఏప్రిల్ 2 : రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానాన్ని బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోనున్నదని, పార్టీ అభ్యర్థి తీగుల్ల పద్మారావు గౌడ్ భారీ మెజార్టీతో విజయం సాధించడం ఖాయమని నగరానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు పేరొన్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ నేతల సమన్వయ సమావేశం మంగళవారం సాయంత్రం మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో మారేడుపల్లిలోని ఆయన నివాసంలో జరిగింది. పార్లమెంట్ అభ్యర్థి, సికింద్రాబాద్ శాసనసభ్యుడు తీగుల్ల పద్మారావు గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ సమావేశంలో పార్టీ నగర అధ్యక్షుడు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్, సీనియర్ నేతలు డాక్టర్ దాసోజు శ్రవణ్కుమార్, విప్లవ్ కుమార్, మన్నె గోవర్ధన్, ఆనంద్ గౌడ్, వెంకటేశ్, మన్నె కవిత, ముఠా జైసింహ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఎంపీ ఎన్నికల్లో చేపట్టాల్సిన చేపట్టాల్సిన చర్యలపై సమగ్రంగా చర్చించారు.
జంట నగరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు. 3న జూబ్లీహిల్స్, 4న సికింద్రాబాద్, 5న ముషీరాబాద్ , 6న సనత్నగర్లో, 7న ఖైరతాబాద్, 8న నాంపల్లి , 10న అంబర్పేట నియోజకవర్గాల్లో సమన్వయ సమావేశాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.