KTR | మేడ్చల్, ఫిబ్రవరి 4(నమస్తే తెలంగాణ): ‘ఇచ్చిన హామీలు ఎగొట్టే ప్రయత్నం చేస్తున్న సీఎం రేవంత్.. మహాలక్ష్మి పథకం కోసం ఆడబిడ్డలు కండ్లల్లో వత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు.. కేసీఆర్పై తిట్ల పురాణం బంద్చేసి.. ముందు ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకో’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆదివారం మేడ్చల్-మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని ఉప్పల్, మల్కాజిగిరి నియోజకవర్గాల విజయోత్సవ సమావేశాల్లో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే ఇచ్చిన హామీలను అమలు చేస్తామని సీఎం రేవంత్ సిగ్గుమాలిన మాటాలు మాట్లాడుతున్నారని, అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ మాట ఎందుకు అనలేదని కేటీఆర్ ప్రశ్నించారు. వంద రోజలు ఓపికగా ఉంటామని.. మార్చి 17 తర్వాత ఆరు గ్యారంటీలు అమలు కాకపోతే ప్రజల పక్షాన పోరాడుతామని స్పష్టం చేశారు. గ్రేటర్లో ప్రజలు ఆలోచించి, అభివృద్ధి కోసం ఓటు వేశారు. జిల్లాలు, గ్రామాల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీలను నమ్మి మోసపోయారు’ అని అన్నారు.
‘కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాక ముందు ప్రజలకు కరెంట్ బిల్లులు కట్టవద్దని అన్నారు. ఇప్పుడు.. కరెంట్ బిల్లులను రేవంత్ కడతారా.. లేక సోనియాగాంధీ కడతారా’.. అని కేటీఆర్ ప్రశ్నించారు. నగరంలో వేసవి ప్రారంభానికి ముందే కరెంట్ కష్టాలు మొదలైనట్లు చెప్పారు.
అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజిగిరి, ఉప్పల్ నియోజకవర్గాల్లో వచ్చిన మెజార్టీ చూస్తుంటే.. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరిలో బీఆర్ఎస్ గెలుపు ఖాయంగా కనిపిస్తుదన్నారు. కాంగ్రెస్ను మల్కాజిగిరిలో మడతపెట్టి కొట్టుడేనన్నారు. ఈ విజయోత్సవ సమావేశాల్లో ఎమ్మెల్యేలు మర్రి రాజశేఖర్రెడ్డి, బండారి లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి, మాజీ ఎంబీసీ చైర్మన్ నందికంటి శ్రీధర్, రావుల శ్రీధర్రెడ్డి, మల్లారెడ్డి హెల్త్ సిటీ చైర్మన్ చామకూర భద్రారెడ్డి పాల్గొన్నారు.
బెదిరింపులు ఇక నడవవంటూ.. మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యేకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరోక్షంగా హెచ్చరించారు. బీఆర్ఎస్ కార్పొరేటర్లు, నాయకులను బెదిరిస్తే.. ఊరుకునేది లేదన్నారు. ఇక బెదిరింపులు నడవవని బెదిరింపు ఫోన్లు వస్తే పోరాటం చేద్దామని, ఎవరూ ఆ ధైర్య పడవద్దని చెప్పారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏదో చేస్తానని గొప్పలు చెప్పుకున్న మాజీ ఎమ్మెల్యే.. ఓటమి పాలయ్యారని, మల్కాజిగిరి నియోజకవర్గ ప్రజలు మర్రి రాజశేఖర్రెడ్డిని ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించారని పేర్కొన్నారు.