సిటీబ్యూరో, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ) : రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ జెండాను ఎగురవేసేందుకు కలిసికట్టుగా పనిచేద్దామని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గ్రేటర్ పిలుపునిచ్చారు. ఎన్నికల ఫలితాలపై నిరాశ చెందకుండా ప్రజల తరఫున కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేలా బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పాత్రను నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
హైదరాబాద్ నగరాభివృద్ధికి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని చెప్పారు. గురువారం బంజారాహిల్స్లోని బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో జీహెచ్ఎంసీ పరిధిలోని బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లతో కేటీఆర్ సమావేశమయ్యారు. కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా హామీలు ఇచ్చి ఎన్నికల్లో గెలిచిందని, హామీలను నెరవేర్చేలా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని కేటీఆర్ అన్నారు.
జీహెచ్ఎంసీలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నగర అభివృద్ధికి ఎప్పటిలాగే నిరంతరంగా కృషి చేస్తుందన్నారు. అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా.. ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసమే పని చేసే పార్టీ బీఆర్ఎస్ అని కేటీఆర్ అన్నారు. జీహెచ్ఎంసీలో భారత రాష్ట్ర సమితికి అపూర్వ విజయం అందించడంలో కీలక పాత్ర వహించిన బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు, పార్టీ శ్రేణులకు కేటీఆర్ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.