మేడ్చల్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ): మల్కాజిగిరి పార్లమెంట్ స్థానాన్ని కైవసం చేసుకునేలా బీఆర్ఎస్ నిర్వహిస్తున్న వరుస సమావేశాలు.. ఆపార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపుతున్నాయి. మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో సమావేశాలను నిర్వహిస్తూ.. గెలుపే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలను సమయత్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తున్న సమావేశాలకు భారీ ఎత్తున ప్రజలు, శ్రేణులు హాజరై విజయవంతం చేస్తున్నారు. స్వచ్ఛందంగా తరలివస్తున్న కార్యకర్తలు, ప్రజలు బీఆర్ఎస్కు మద్దతు తెలుపుతున్నారు.
మల్కాజిగిరి పార్లమెంట్ స్థానంపై గులాబీ జెండా ఎగురవేసేందుకు ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డికి మద్దతుగా క్షేత్రస్థాయిలో శ్రేణులు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు పథకాలను అమలు చేస్తామని చెప్పి.. ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సమావేశాల్లో బీఆర్ఎస్ నేతలు శ్రేణులకు సూచిస్తున్నారు. రైతుల రుణ మాఫీ చేయకపోవడం, క్వింటాలుకు రూ. 500 బోనస్పై ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయకపోవడం వంటి విషయాలను ప్రజల్లో విస్తృతంగా తీసుకెళ్లేలా దిశానిర్దేశం చేస్తున్నారు.