గోల్నాక, అక్టోబర్ 29 : అంబర్పేట నియోజకవర్గంలో ఇతర పార్టీల చేరికలతో కారు జోరు కొనసాగుతున్నది. ఆదివారం అంబర్పేట డివిజన్ హైమద్నగర్కు చెందిన సుమారు 200 మంది ముస్లిం మైనార్టీ యువకులు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. అలాగే విశ్వబ్రాహ్మణ సమైఖ్యతా సంఘం అధ్యక్షుడు మామిడాల గోపాలచారి ఆధ్వర్యంలో ఆ సంఘం ప్రతినిధులు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే వెంకటేశ్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…ఓ వైపు సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు.. మరో వైపు అంబర్పేట నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి బీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు.
దీంతో పాటు పలు సామాజిక వర్గాలకు చెందిన ప్రతినిధులు తనకు స్వచ్ఛందంగా మద్దతు తెలుపుతూ పార్టీలో చేరడం సంతోషంగా ఉన్నదన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల పదిహేనేండ్లుగా అభివృద్ధికి నోచుకోని నియోజకవర్గం కేవలం నాలుగున్నరేండ్లలో అన్ని రంగాల్లో అభివృద్ధిలో పరుగులు పెడుతోందన్నారు. ఈ కార్యక్రమంలో అంబర్పేట డివిజన్ కార్పొరేటర్ విజయ్కుమార్గౌడ్, డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు సిద్ధార్థ్ ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి జాఫర్తో పాటు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.