Minister Srinivas Yadav | హైదరాబాద్లో ఈ నెల 25న నిర్వహించనున్న ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొంటారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 17 నుంచి అన్ని నియోజకవర్గాల్లో కేటీఆర్ రోడ్ షోలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఉద్యమ నాయకుడే ముఖ్యమంత్రిగా ఉండడంతో గతంలో ఎన్నడూ లేనివిధంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను గడిచిన తొమ్మిదిన్నర సంవత్సరాల్లో చేసి చూపించామన్నారు.
మినీ ఇండియాగా పిలుచుకునే నగరం హైదరాబాద్ అనీ.. రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రజలకు కావాల్సిన అన్ని సౌకర్యాలను కల్పిస్తూ ప్రభుత్వం ఎంతో అభివృద్ధి చేసిందని వివరించారు. చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రజలు పట్టం కడతారని, తిరిగి రాష్ట్రంలో అధికారం చేపట్టి హ్యాట్రిక్ సాధిస్తామని స్పష్టం చేశారు. గ్రేటర్లో అన్ని స్థానాలను గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. మేనిఫెస్టోలో చెప్పిన కార్యక్రమాలే కాకుండా చెప్పనివి కూడా చేసిన ఘనత తమకే దక్కుతుందని తలసాని తెలిపారు. సొంత ఇల్లు లేని పేద ప్రజల సొంత ఇంటి కలను సాకారం చేయాలనే ఉద్దేశంతోనే దేశంలో ఎక్కడా లేని విధంగా డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం చేపట్టినట్లు వివరించారు.
జీహెచ్ఎంసీ పరిధిలో ఇప్పటి వరకు లక్ష ఇండ్ల నిర్మాణం చేపట్టి.. 70వేల ఇండ్లను అర్హులకు అందజేశామన్నారు. మరో ౩౦వేల ఇండ్ల నిర్మాణం జరుగుతుందని వివరించారు. ఎస్ఎన్డీపీ కార్యక్రమం ద్వారా నాలాలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి వరద ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా రోడ్ల అభివృద్ధి, అండర్ పాస్లు, ఫ్లై ఓవర్ల నిర్మాణం వంటి అభివృద్ధి పనులు చేపట్టామని చెప్పారు. మరో లక్ష ఇండ్లను నిర్మిస్తామని మేనిఫెస్టోలో ముఖ్యమంత్రి ప్రకటించారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో బీసీ డిక్లరేషన్, గ్యారెంటీలు అంటూ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన నాయకులు ప్రకటిస్తున్నారని, అవి అమలు కాకుంటే ప్రజలు ఎవరిని అడగాలని ప్రశ్నించారు.