BRS | సిటీబ్యూరో, మార్చి 27 (నమస్తే తెలంగాణ) : పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ దూకుడు పెంచింది. హైదరాబాద్, సికింద్రాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, చెవేళ్ల పార్లమెంట్ నియోజకవర్గాలకు ఎంపీ అభ్యర్థులుగా శ్రీనివాస్ యాదవ్, పద్మారావు గౌడ్, రాగిడి లక్ష్మారెడ్డి, కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్లను బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ వ్యూహాత్మకంగా రంగంలోకి దించారు.
ఇందులో భాగంగానే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే పునరావృతం చేసేలా.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనేతలు, క్యాడర్తో కలిసి వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం మినహా అన్ని పార్లమెంట్ స్థానాలకు సంబంధించి వరుసగా రెండు రోజులు సమావేశాలు నిర్వహించి శ్రేణులకు ప్రచారంలో అనుసరించాల్సిన విధానాలపై చర్చించి, పార్టీ అభ్యర్థుల గెలుపునకు పక్కా ప్రణాళికల అమలుకు దిశానిర్ధేశం చేశారు.
వరుసగా జరిగిన సమావేశాలతో పార్టీ క్యాడర్లో ఉత్సాహాన్ని నింపాయి. ఈ నేపథ్యంలోనే త్వరలోనే అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా విస్తృత స్థాయి సమావేశాలకు సిద్ధమవుతున్నారు. సికింద్రాబాద్, సనత్నగర్, అంబర్పేట, ముషీరాబాద్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, నాంపల్లి నియోజకవర్గాలకు సంబంధించిన ప్రచారం వచ్చే ఆదివారం నుంచి వరుసగా నియోజకవర్గాల వారీగా సమీక్షలకు సిద్ధమవుతున్నారు. పార్టీ అభిమానులు, నాయకులు వేల సంఖ్యలో సమావేశాలకు హాజరై అభ్యర్థి గెలుపునకు కార్యాచరణతో ముందుకు వెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు. మేడ్చల్-మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంలోనూ అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమావేశాలకు సిద్ధమయ్యారు.
కాంగ్రెస్, బీజేపీలపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను ప్రస్తుత ఎన్నికల్లో అనుకూలంగా మలుచుకోవాలని బీఆర్ఎస్ శ్రేణులు భావిస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం.. అన్ని వర్గాల సంక్షేమాన్ని సైతం విస్మరించడం వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు కృషి చేసేలా ప్లాన్ చేశారు. అసెంబ్లీ నియోజకవర్గాల సమావేశాలు ముగిసిన తర్వాత మరోసారి పార్లమెంట్ స్థాయిలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించడం, ఆ తర్వాత కేసీఆర్తో భారీ బహిరంగ సభల నిర్వహణకు సంబంధించి రూట్ మ్యాప్ను సిద్ధం చేస్తుండడంతోపాటు రోడ్ షోలను నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు.