అంబర్పేట, మే 5 : గౌడ కులస్తులంతా గర్జించాలి.. ఈ నెల 13వ తేదీన జరుగనున్న పార్లమెంటు ఎన్నికల్లో సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గంలో ఉన్న గౌడ కులస్తులు ఒక్కొక్కరు మీతో పాటు మరో వంద మంది చేత ఓటు వేయించాలని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి తీగుళ్ల పద్మారావుగౌడ్ పిలుపునిచ్చారు. బాగ్అంబర్పేట డివిజన్లోని గౌడ సంఘం భవనంలో అంబర్పేట నియోజకవర్గం గౌడ జన జాతర(సమ్మేళనం) పంజాల గిరిధర్గౌడ్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పద్మారావుగౌడ్ మాట్లాడుతూ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గౌడ జాతికి న్యాయం చేసేందుకు తాను ఎక్సైజ్ శాఖ తీసుకొని మంత్రిగా వారి సమస్యల పరిష్కారానికి కృషి చేశానన్నారు. గౌడ కులస్తుల్లో ఐక్యత ఎంతో అవసరమని తెలిపారు. అంబర్పేటలో గౌడ కుటుంబాలు చాలా ఉన్నాయని, వారంతా ముందుకు వచ్చి లోక్సభ ఎన్నికల్లో తనకు ఓటు వేసి గెలిపిస్తే మీ కుల బిడ్డగా మొత్తం గౌడ జాతికి అండగా ఉంటానని తెలిపారు.
గతంలో కూడా చాలాసార్లు మన కులస్తులను ఏకతాటి పైకి తీసుకువచ్చేందుకు కృషి చేసినట్లు పేర్కొన్నారు. ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఒక్క గౌడ కులస్తుడిపై పగతో మొత్తం కల్లు దుకాణాలను మూసివేశారని చెప్పారు. కేసీఆర్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎక్సైజ్ శాఖ మంత్రిగా రాష్ట్రంలో ఉన్న అన్ని కల్లు దుకాణాలను తెరిపించిన ఘనత పద్మారావుకే దక్కుతుందన్నారు. బకాయిలను మాపీ చేయించాడని, రెంటల్స్ లేకుండా చేశారని.. అటువంటి వ్యక్తిని గెలిపించాలన్నారు. ఎన్నికల ఇన్చార్జి దాసోజు శ్రావణ్ మాట్లాడుతూ పద్మారావుకు టికెట్ ఇచ్చినప్పుడే గెలుపు ఖాయమైందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు బి.పద్మావెంకటరెడ్డి, ఇ.విజయ్కుమార్గౌడ్, దూసరి లావణ్యశ్రీనివాస్గౌడ్, మాజీ కార్పొరేటర్ కె.పద్మావతిడీపీరెడ్డి, హైకోర్టు న్యాయవాది గుండ్రాతి శారదాగౌడ్, నాయకులు జె.భాస్కర్గౌడ్, ఎ.జీవన్గౌడ్, పి.చంద్రశేఖర్గౌడ్లతో పాటు గౌడ సంఘం పెద్దలు పాల్గొన్నారు.