Padma Rao Goud | ఉస్మానియా యూనివర్సిటీ, ఏప్రిల్ 22: రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో దేశం మొత్తం చూపు సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం వైపే ఉన్నదని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి తీగుళ్ల పద్మారావుగౌడ్ అన్నారు. గత ఎంపీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చని కిషన్రెడ్డి ఎక్కడున్నారని ప్రశ్నించారు. ఐదేండ్లలో పూర్తి చేస్తానన్న అంబర్పేట ఫ్లై ఓవర్ పనులు నేటికీ ఎందుకు పూర్తి కాలేదని ప్రశ్నించారు. సికింద్రాబాద్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ బూత్ కమిటీల ప్రతినిధుల సమావేశాన్ని బౌద్ధనగర్ డివిజన్లోని రాఘవ గార్డెన్స్లో నిర్వహించారు.
ముఖ్య అతిథిగా హాజరైన పద్మారావుగౌడ్ మాట్లాడుతూ ఈ ఐదేండ్లలో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో కిషన్రెడ్డి చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలన్నారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి దానం నాగేందర్ వెళ్తారని దుయ్యబట్టారు. సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి మేడే రాజీవ్సాగర్, కార్పొరేటర్లు సామల హేమ, కంది శైలజ, సునీత, లక్ష్మీప్రసన్న తదితరులు పాల్గొన్నారు.
ముషీరాబాద్: ఎన్నికల ప్రచారంలో భాగంగా సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి తీగుళ్ల పద్మారావు గౌడ్ ఎమ్మెల్యే ముఠా గోపాల్తో కలిసి కవాడిగూడ డివిజన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి నేరుగా ఓటర్లను కలిసి.. ఢిల్లీలో తెలంగాణ వాణి వినిపించాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని కోరారు.