సిటీబ్యూరో, ఫిబ్రవరి 18(నమస్తే తెలంగాణ): చెల్లనిరూపాయికి గీతలెక్కువ.. చేతకాని రేవంత్రెడ్డికి చిల్లర వేషాలెక్కువ.. అంటూ బిఆరెస్నేత దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. బిఆర్ఎస్ పార్టీపై అసత్యప్రచారంచేస్తున్న తెలుగువైబ్ ట్విట్టర్ హ్యాండిల్పై కఠినచర్యలు తీసుకోవాలంటూ మంగళవారం సైబరాబాద్, సైబర్క్రైమ్ స్టేషన్లో దాసోజు శ్రవణ్, డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, ఎర్రోళ్ల శ్రీనివాస్, అభిలాష్ రంగినేని, కురువ విజయ్కుమార్లు ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తెలుగువైబ్ ట్విట్టర్ హ్యాండిల్ సృష్టించి బిఆర్ఎస్ నేతలు, నాయకత్వంపై చిల్లర ప్రచారం చేస్తున్నదన్నారు. కేసీఆర్, హరీశ్రావు మధ్య విభేదాలు ఉన్నట్లు విష ప్రచారం చేస్తున్నదని, తప్పుడు పోస్టులు పెట్టడంద్వారా బీఆర్ఎస్ను బద్నామ్ చేయాలని రేవంత్రెడ్డి కుట్రకు తెరలేపారని శ్రవణ్ ఆరోపించారు. బిఆర్ఎస్ కేడర్ మనోస్థైర్యాన్ని అబద్దపు కథనాలతో దెబ్బతీస్తున్న తెలుగువైబ్పై ఐటి చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులను తాము కోరామని శ్రవణ్ చెప్పారు తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించి బిఆర్ఎస్ కీలకనేతగా ఉన్న మాజీ మంత్రి హరీశ్రావు ప్రతిష్ట దెబ్బతీసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నదని ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఆరోపించారు.
సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తూ కాంగ్రెస్ పార్టీ తమ నేతల వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నదని, సోషల్ మీడియాలో బిఆర్ఎస్పై అసభ్య పోస్టులు పెడుతున్న వారిపై ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆయన మండిపడ్డారు. కనీసం ఈ విషయంలో తాము ఇచ్చిన ఆధారాలతో ఎఫ్ఐఆర్ చేయాలని పోలీసులను కోరామన్నారు. గతంలో కేటిఆర్పై వ్యక్తిగత ఆరోపణలు చేసినందుకు ఐఏఎస్, ఐపీఎస్ అదికారుల సంఘాలు స్పందించాయని, మరి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై రేవంత్రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని, వీటిపై సంఘాలు ఎందుకు మౌనంగా ఉన్నాయో చెప్పాలని ప్రవీణ్కుమార్ డిమాండ్ చేశారు.