Medchal | నగరానికి అతి సమీపంలో ఉన్న మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ప్రగతిలో పరుగులు పెడుతోంది. పరిశ్రమల ఖిల్లాగా ఖ్యాతి పొంది రాష్ట్రం ఏర్పడ్డాక సుమారు రూ. 15 వేల కోట్ల పెట్టుబడులు సాధించి జిల్లాలో 2 లక్షల 18 వేల మందికి ఉపాధి కల్పించింది. ఇందులో 400 కోట్లతో నిర్మించనున్న ఐటీ హబ్ నిర్మాణం జిల్లాకే తలమానికం. గ్రామీణ, పట్టణ వాతావరణం కలగలిపి ఉన్న జిల్లాలో 4 కార్పొరేషన్లు, 9 మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటిలో350 కోట్ల నిధులను వెచ్చించి మౌలిక సదుపాయాలను మెరుగుపర్చారు. జిల్లా ప్రజల ఆరోగ్యం కోసం 101 బస్తీ దవాఖానలను మంజూరు చేయగా ఇప్పటి వరకు 81 బస్తీ దవాఖానలను ప్రారంభించారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు అందించి, సాగునీటి కోసం మిషన్ కాకతీయతో చెరువుల రూపు రేఖలను మార్చారు. రూ. 70 కోట్లతో ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ తీసుకొచ్చారు. ఇలా అన్ని రంగాల్లో మేడ్చల్ మల్కాజిగిరిని అభివృద్ధిలో నంబర్ 1 చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికి దక్కుతుంది.
మేడ్చల్, మార్చి15(నమస్తే తెలంగాణ): మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తున్నది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి మేడ్చల్ జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నది. హైదరాబాద్ నగరానికి సమీపంలో ఉన్న మేడ్చల్-మల్కాజిగిరి శరవేగంగా అభివృద్ధి చెందుతున్నది. ఇండస్ట్రియల్, ఐటీహబ్, గ్రామీణ ప్రాంతాలు, శివారు మున్సిపాలిటీల అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక నిధులను మంజూరు చేస్తున్నది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాగా మారిన నాటి నుంచి జిల్లా రూపురేఖలు మారిపోయాయి. అన్ని రంగాల్లో అభివృద్ధి పనులు జోరుగా సాగుతున్నాయి.
మన ఊరు-మనబడి కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి జిల్లాకు ప్రభుత్వం 70 కోట్ల నిధులను కేటాయించింది. జిల్లాలో ఇప్పటి వరకు 30 పాఠశాలల్లో అభివృద్ధి పనులు పూర్తికాగా కొన్నింటిని ప్రారంభించంగా మరికొన్ని పాఠశాలలను త్వరలోనే ప్రారంభించనున్నారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని రకాల సౌకర్యాలను కల్పించారు.
మిషన్ భగీరథ పథకానికి రూ.160 కోట్ల నిధులను వెచ్చించారు. మిషన్ భగీరథ పథకంలో భాగంగా జిల్లాలో మేడ్చల్, కుత్బుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రజలకు సురక్షిత తాగు నీటిని అందించేందుకు ప్రభుత్వం ఓఆర్ఆర్ వెలుపల ఉన్న 104 గ్రామాల్లో ఇంటింటికి నీటి సరఫరా చేస్తున్నది. అన్ని గ్రామాలకు నీటిని సరఫరా చేసి రాష్ట్రంలోనే జిల్లా నంబర్వన్ స్థానంలో ఉంది.
మేడ్చల్ జిల్లాగా ఏర్పడిన నాటి నుంచి రూ.350 కోట్ల నిధులతో అన్ని రంగాలను అభివృద్ధి చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలు, శివారు మున్సిపాలిటీల్లో నివసించే ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలను కల్పించేందుకు ఇప్పటి వరకు రూ.350 కోట్ల నిధులను వెచ్చించారు. మరో రూ.550 కోట్ల నిధులతో భవనాలు, రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు, సీసీరోడ్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి.
మేడ్చల్ జిల్లాలో రూ.400 కోట్లతో ఐటీహబ్ నిర్మాణానికి ఇటీవలే శంకుస్థానన చేశారు. జిల్లాలోని కండ్లకోయలో 18వేల చదరపు అడుగులో ఐటీ హబ్ నిర్మాణానికి ప్రభుత్వం టెండర్లను పూర్తి చేసింది. త్వరలోనే పనులు ప్రారంభించనున్నారు. ఐటీహబ్ నిర్మాణం పూర్తయితే 15 వేల మందికి పైగా ఉద్యోగాలు లభించనున్నాయి.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం జిల్లా పరిశ్రమల ఏర్పాటులో నంబర్వన్ స్థానంలో నిలిచింది. 2014 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు 5,511 ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు వివిధ శాఖల నుంచి 9,412 పరిశ్రమలకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. దీంతో జిల్లాలో 15 వేల 49 కోట్ల పెట్టుబడులు వచ్చి రెండు లక్షల 18 వేల మందికి ఉపాధి లభించింది.
జిల్లాలోని శివారు ప్రాంతాలతో కలిపి 13 మున్సిపాలిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇందులో బోడుప్పల్, నిజాంపేట్, పీర్జాదిగూడ, జవహర్నగర్ కార్పొరేషన్లు కాగా మేడ్చల్, నాగారం, దమ్మాయిగూడ, పోచారం, ఘట్కేసర్, గుండ్లపోచంపల్లి, దుండిగల్, కొంపల్లి, తూంకుంటలు మున్సిపాలిటీలుగా ఏర్పాటు అయ్యాయి.
జిల్లాలోని మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లో ప్రభుత్వం 101 బస్తీ దవాఖానలను మంజూరు చేయగా 81 బస్తీ దవాఖానలు ప్రారంభమై ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నాయి. బస్తీ దవాఖానలతో పాటు పల్లె దవాఖానల పక్కా భవనాల కోసం ప్రభుత్వం రూ.3 కోట్ల నిధులను కేటాయించింది.
మిషన్ కాకతీయ పథకంలో జిల్లాలో ఉన్న 489 చెరువుల అభివృద్ధికి రూ.221 కోట్ల నిధులను వెచ్చించారు. భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకుని చెరువులు అభివృద్ధి చేసి సుందరీకరిస్తున్నారు. చెరువుల కబ్జాలకు గురికాకుండా ప్రభుత్వం చెరువులను సంరక్షించే చర్యలు తీసుకుంటున్నది. ప్రతి ఏడాది 20 శాతం చెరువులను మరమ్మతులు చేస్తున్నారు.
జిల్లాలోని మున్సిపాలిటీలు, గ్రామీణ ప్రాంతాల ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తున్నది. పట్టణ, పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డులు, వైకుంఠధామాలకు ప్రభుత్వం ప్రతి ఏడాది ప్రత్యేక నిధులను కేటాయిస్తున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు రూ.35 కోట్లను పట్టణ, పల్లె పకృతి వనాలు, డంపింగ్ యార్డులు, వైకుంఠధామాలకు కేటాయించింది.