సిటీబ్యూరో, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను శనివారం గ్రేటర్ వ్యాప్తంగా అత్యంత ఘనంగా నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, మాగంటి గోపీనాథ్ తెలిపారు. వేడుకలు ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతాయని, ఎంపీ కేశవరావు, ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీశ్రావుతో పాటు ఇతర ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారని తెలిపారు. కాగా, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు, శ్రేణులు, అభిమానులు పలు ఆలయాలు, మసీదులు, చర్చీల్లో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు నిర్వహించనున్నారు.
వెయ్యి మంది ఆటో డ్రైవర్లకు లక్ష రూపాయల కవరేజీ వచ్చే విధంగా మొత్తం 10 కోట్ల రూపాయల విలువైన ప్రమాద, ఆరోగ్య బీమా పత్రాలు, దివ్యాంగులకు వీల్చైర్స్, ఆస్పత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ వంటి సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించనున్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దిన కేసీఆర్ రాజకీయ ప్రస్థానం, ఉద్యమ నేపథ్యంలో 30 నిమిషాల వ్యవధితో కూడిన ‘తానే ఒక చరిత్ర’ పేరుతో రూపొందించిన ప్రత్యేక డాక్యుమెంటరీని ఈ వేడుకల సందర్భంగా ప్రదర్శించనున్నారు.