కంటోన్మెంట్, అక్టోబర్ 22: తెలంగాణలో మళ్లీ అధికారంలోకి వచ్చేది కేసీఆరేనని, సంక్షేమ ఫలాలు ఇచ్చేదీ కేసీఆరేనని బీఆర్ఎస్ కంటోన్మెంట్ అభ్యర్థి లాస్యనందిత అన్నారు. సీఎం కేసీఆర్ ఇటీవల విడుదల చేసిన మ్యానిఫెస్టో ప్రకారం తదుపరి ఎన్నికల్లో గెలిచిన వెంటనే అర్హులందరికీ రూ.400కే వంట గ్యాస్ సిలిండర్లు అందుతాయన్నారు. కంటోన్మెంట్ పరిధిలోని ఆరో వార్డు ఎల్ఐసీ కాలనీ, బ్యాంకు కాలనీ, సిఖ్ విలేజ్, మస్తాన్ హోటల్ చౌరస్తా, కుమ్మరిగుట్ట, తాడ్బండ్తో పాటు పలు ప్రాంతాల్లో ఆదివారం లాస్యనందిత ఇంటింటి ప్రచారాన్ని చేపట్టారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి అభివృద్ధి చేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని, తనకు అత్యధిక మెజార్టీ అందించాలని కోరారు. ఎన్నికల్లో గెలిచిన వెంటనే రైతుబీమా మాదిరిగా కేసీఆర్ బీమా పేరిట రాష్ట్రంలోని అర్హులందరికీ రూ.5 లక్షల బీమా సౌకర్యాన్ని అందించనున్నట్లు చెప్పారు. ఆరోగ్యశ్రీ పరిమితిని కూడా రూ.15 లక్షలకు పెంచనున్నట్లు పేర్కొన్నారు. బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలోని ఇలాంటి హామీలను చూసిన ప్రతిపక్షాలకు నిద్రపట్టడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ గ్యారెంటీ హామీలను, మాయమాటలను ప్రజలెవరూ నమ్మడం లేదని అన్నారు. కార్యక్రమంలో బోర్డు మాజీ సభ్యులు పాండుయాదవ్, సీనియర్ నాయకులు దీనానాథ్ యాదవ్, భాస్కర్ రెడ్డి, వంగల మల్లేశ్, ఝూన్సీ, జయరామ్, యశ్వంత్, నరహరి, చిన్నికృష్ణ, హేమలత, గుడియమ్మ, సాయిచరణ్, రాజు తదితరులు పాల్గొన్నారు.