బంజారాహిల్స్,డిసెంబర్ 1: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మంచి మెజార్టీతో మూడోసారి విజయం సాధించం ఖాయమని బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ ధీమా వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్లోని తన క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ ముఖ్య నాయకులతో శుక్రవారం సమావేశమయిన మాగంటి గోపీనాథ్ పోలింగ్ సరళిపై సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గంలో 47.49 శాతం మాత్రమే పోలింగ్ నమోదు కావడంతో ఎక్కడెక్కడ ఎక్కువ పోలింగ్ శాతం నమోదయిందనే విషయాన్ని గురించి ఆరా తీశారు. బోరబండ డివిజన్ పరిధిలోని పోలింగ్ కేంద్రాల్లో సుమారు 52శాతం దాకా ఓటింగ్ నమోదయినట్లు తేలడంతో అక్కడ బీఆర్ఎస్ పార్టీకి స్పష్టమైన ఆధిక్యత వచ్చిందని నాయకులు భావిస్తున్నారు.
మైనార్టీలు అధికంగా ఉండే షేక్పేట డివిజన్ పరిధిలో తక్కువ పోలింగ్ శాతం నమోదు కావడానికి గల కారణాలపై బూత్ల వారీగా సమీక్ష నిర్వహించారు. యూసుఫ్గూడ, రహ్మత్నగర్ డివిజన్ల పరిధిలో కూడా బీఆర్ఎస్కు మంచి ఓటింగ్ నమోదయినట్లు పోలింగ్ సరళిని బట్టి తెలుస్తుందని మాగంటి గోపీనాథ్ పేర్కొన్నారు. నియోజకవర్గంలో పోలింగ్ సరళితో పాటు తమకున్న పక్కా అంచనాల మేరకు మంచి మెజార్టీతో విజయం సాధించబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. కౌంటింగ్రోజున పాటించాల్సిన జాగ్రత్తలను గురించి నాయకులకు వివరించారు. కౌంటింగ్ ఏజెంట్లు అప్రమ్తత్తంగా ఉండాలని, నిర్దేశిత సమయంలోపునే కౌంటింగ్ కేంద్రంలోకి చేరుకోవాలని మాగంటి గోపీనాథ్ సూచించారు.