మేడ్చల్ / మేడ్చల్ కలెక్టరేట్, మే 3 : ఇచ్చిన హామీలతో పాటు అడగనివి కూడా ముఖ్యమంత్రి చేస్తున్నారని, చేతల సీఎం కేసీఆర్ అని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి కొనియాడారు. దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధి రాజీవ్ చౌరస్తాలోని బీవేరో కన్వెన్షన్లో మంగళవారం జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి తదితర పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో తాగు, సాగునీరు అందుతుందన్నారు. మంత్రి కేటీఆర్ కృషితో హైదరాబాద్కు యాపిల్, ఫేస్బుక్, అమెజాన్ తదితర ఎన్నో బహుళ జాతి కంపెనీలు తరలివచ్చాయన్నారు. వాటితో లక్షల మంది తెలంగాణ బిడ్డలకు ఉపాధి లభించిందన్నారు.
ఇంతకు ముందు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఏమి చేసిందని, బీజేపీ ఏమి చేస్తుందని ఆయన ప్రశ్నించారు. బీజేపీ నేతలకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ను దూషించడం తప్పా ఏమి రాదన్నారు. నియోజకవర్గ ప్రజల ఓట్లతో ఎంపీగా ఎన్నికైన వ్యక్తి అభివృద్ధి కోసం ఒక్క రూపాయైనా తీసుకువచ్చాడా అని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులకు ఓట్లు అడిగే అర్హత లేదన్నారు. బీఆర్ఎస్కు వివిధ రాష్ర్టాల్లో బ్రహ్మరథం పడుతున్నారన్నారు. బీఆర్ఎస్ రాష్ట్రంలో హ్యాట్రిక్ కొట్టడం ఖాయమన్నారు. దేశంలో కూడా సత్తా చాటుతుందని అన్నారు. జవహర్నగర్ డంపింగ్యార్డులో రూ.500 కోట్లతో చెత్తతో కరెంట్ తయారు చేస్తున్నారని, రూ.250 కోట్లతో మురికి నీటి శుద్ధి చేస్తున్నారన్నారు. ఇంటింటికీ శుభ్రమైన నీళ్లిచ్చిన ఘనత కూడా సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. రూ.16 కోట్లతో కోమటికుంటను శుభ్రం చేస్తున్నామని తెలిపారు. 58, 59 జీవోతో నిరుపేదలకు సొంతింటి కల నిజమైందన్నారు. మేడ్చల్ నియోజకవర్గానికి సీఎం కేసీఆర్ 1100 యూనిట్లు దళితబంధు కింద కేటాయించారని, త్వరలో పంపిణీ చేస్తామన్నారు.
దమ్మాయిగూడ మున్సిపాలిటీ బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసిన కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డిని మున్సిపాలిటీ బీఆర్ఎస్ యూత్ అధ్యక్షులు జవాజీ మణికంఠ ముదిరాజ్ భారీ గజమాలతో సత్కరించి గధను బహుకరించారు. అంతకు ముందు బీఆర్ఎస్ పార్టీ మేడ్చల్ నియోజకవర్గ ఇన్చార్జి చామకూర మహేందర్ రెడ్డి పార్టీ జెండాను అవిష్కరించారు. సమ్మేళనం అనంతరం మహిళలతో కలిసి మంత్రి భోజనాలు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వసుపతి ప్రణీత శ్రీకాంత్ గౌడ్, వైస్ చైర్మన్ మాదిరెడ్డి నరేందర్ రెడ్డి, బీఆర్ఎస్ అధ్యక్షులు కౌకుంట్ల తిరుపతిరెడ్డి, ప్రధాన కార్యదర్శి సంపనబోలు హరిగౌడ్, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.