Congress | బంజారాహిల్స్, ఫిబ్రవరి 28 : జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ నాయకులు, రౌడీమూకలతో కలిసి దాడులకు తెగబడ్డారు. యూసుఫ్గూడ డివిజన్ వెంకటగిరిలో నివాసముంటున్న సయ్యద్ అక్బర్ (23), కృష్ణానగర్లో ఉంటున్న సాయి కుమార్ అనే యువకుడు సుమారు ఐదేండ్లుగా బీఆర్ఎస్ పార్టీలో చురుగ్గా పనిచేస్తున్నారు. కృష్ణానగర్లో నివాసముంటున్న మహ్మద్ ఇస్మాయిల్ అలియాస్ చోర్ అబ్బూ బోరబండ కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్కు ప్రధాన అనుచరుడిగా ఉన్నాడు. మంగళవారం రాత్రి జూబ్లీహిల్స్ రోడ్ నం.10 నుంచి వెంకటగిరికి వెళ్లేదారిలో కాపు కాసిన చోర్ అబ్బూతో పాటు అబేజ్, అల్తాఫ్, శ్రీకాంత్ చౌదరి, సీహెచ్. సాయి, శ్రీనాథ్ అనే కాంగ్రెస్ కార్యకర్తలు జిమ్ నుంచి బయటకు వచ్చిన సయ్యద్ అక్బర్ను బలవంతంగా బైక్ మీద ఎక్కించుకొని.. కొట్టుకుంటూ గాయత్రీహిల్స్లోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లారు. ఎక్కడకు వెళ్లకుండా బంధించడంతో పాటు కర్రలతో కొడుతూ తన మీద గతంలో తప్పుడు కేసులు పెట్టానని.. ఒప్పుకో అంటూ వీడియోలు తీశారు. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, కార్పొరేటర్ రాజ్ కుమార్ చెప్పడంతోనే కేసులు పెట్టానని చెబితేనే వదిలిపెడుతామని, లేకుంటే ఇక్కడే చంపేస్తామంటూ తీవ్రస్థాయిలో దాడికి పాల్పడ్డారు. భయాందోళనకు గురైన అక్బర్ వారు చెప్పిన విధంగా వీడియోలో చెప్పాడు. అక్కడి నుంచి కృష్ణానగర్లోని సింధూ టిఫిన్ సెంటర్ వద్దకు వచ్చి బీఆర్ఎస్ కార్యకర్త సాయిపై పిడిగుద్దులతో విరుచుకుపడడంతో పాటు పైప్తో దాడికి పాల్పడ్డారు.
ఇప్పుడు నడుస్తున్నది మా ప్రభుత్వం.. ఇక నుంచి మీరు పరుగెత్తాలి.. అంటూ దుర్భాషలాడారు. వారి వద్ద నుంచి తప్పించుకుని వెళ్లేందుకు ప్రయత్నించగా వెంటపడి మరోసారి దాడికి పాల్పడ్డారు. స్థానికులు డయల్ 100 ద్వారా జూబ్లీహిల్స్ పోలీసులకు సమాచారం ఇవ్వగా అక్కడకు చేరుకోవడంతో చోర్ అబ్బూ తదితరులు అక్కడి నుంచి పారిపోయారు. బాధితులు ఉస్మానియా ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్కు వచ్చిన బాధితులు.. తమపై జరిగిన దాడిని మీడియాకు వివరించారు. బాధితుల ఫిర్యాదుతో నిందితులు చోర్ అబ్బూ, అబేజ్, అల్తాఫ్, శ్రీకాంత్ చౌదరి, సీహెచ్.సాయి, శ్రీనాథ్ల మీద ఐపీసీ 324, 342,363,506 రెడ్విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు.. సీసీ ఫుటేజీని సేకరించారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆగడాలు రోజురోజుకూ శ్రుతి మించుతున్నాయని కార్పొరేటర్లు దేదీప్యరావు, రాజ్కుమార్ పటేల్ అన్నారు. యూసుఫ్గూడ్ డివిజన్ బీఆర్ఎస్ కార్యకర్తలు అక్బర్, సాయిపై కాంగ్రెస్ కార్యకర్తల దాడి గురించి సమాచారం అందుకున్న కార్పొరేటర్లు బాధితులకు సంఘీభావం తెలిపారు. ఈ దాడుల వెనుక బోరబండ కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్ ఉన్నారని ఆరోపించారు.