సిటీబ్యూరో, నవంబర్ 10 ( నమస్తే తెలంగాణ ) : ఆ రెండు పార్టీలు ఒక్కటయ్యాయి. హస్తం కమలం మింగిలయ్యాయి. బీఆర్ఎస్ను ఓడించడమే లక్ష్యంగా ఈ దేశంలో బద్ధ శత్రువులమని చెప్పుకుంటున్న జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు కలిసి పనిచేస్తున్నాయి. ఈ రహస్య ఒప్పందం తెలంగాణ ఎన్నికల సాక్షిగా బట్టబయలైంది. అభివృద్ధిలో దూసుకుపోతున్న తెలంగాణలో బీఆర్ఎస్ను ఓడించడం తేలికైన విషయం కాకపోవడంతో సిద్ధాంతాలను సైతం పక్కనపెట్టి కాంగ్రెస్, బీజేపోళ్లు ఒక్కటయ్యారు. ఎలాగైనా తెలంగాణలో ‘గెలిస్తే మీరు లేదా మేము’ అనే సిద్ధాంతంతో ప్రణాళికలు రచిస్తున్నారు. మొన్నటి వరకు ఆ రెండు పార్టీలు ఒక్కటే స్లోగన్ మీద రాజకీయాలు చేశాయి. చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి వెళ్లి బండి సంజయ్, రేవంత్ రెడ్డి ప్రమాణం కూడా చేశారు. ఆనాడే ఆ ఇద్దరు వ్యక్తుల పార్టీలు ఒక్కటేనని ప్రజలు భావించారు. ఇప్పుడు మరోసారి అభ్యర్థులకు టికెట్లు ఖరారు చేయడంలో కూడా ఆ రెండు పార్టీలు ఒక్కటేనని స్పష్టమైంది. గ్రేటర్లో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్, బీజేపీలు లోపాయికారి ఒప్పందంలో పనిచేస్తున్నాయని ఆ పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అందులో భాగంగానే బలమైన అభ్యర్థులున్న చోట బలహీన అభ్యర్థులను బరిలో దించి వికృత క్రీడకు తెరతీశారు. అయితే హస్తం, కమలం ప్రేమ బండారం ప్రజలు అర్థం చేసుకోవడంతో ఏం చేయాలో తెలియక ఆ పార్టీ నాయకులు బుజాలు తరుముకుంటున్నారు. ఓడిపోయే సీటు అప్పగించి బకరాలను చేశారని ఆ పార్టీ అభ్యర్థులు వారి వారి అధిష్ఠానం మీద గుర్రుగా ఉన్నట్టు సమాచారం.
ముషీరాబాద్లో హర్యాణా గవర్నర్ దత్తాత్రేయ కూతురు విజయ లక్ష్మి బీజేపీ నుంచి టికెట్ దక్కుతుందని అనేక ఆశలు పెట్టుకుంది. సామాజిక సేవలు చేస్తూ ప్రజల్లోకి వెళ్లింది. నాయకులు, కార్యకర్తలతో అనేక సమావేశాలు నిర్వహించి ఎమ్మెల్యే టికెట్ తనకే అని ప్రకటించుకుంది. ఇదే సీటుపై లక్ష్మణ్ కూడా ఆశతో ఉన్నాడు. కానీ ఏమైంది? సీన్ మారింది. వారిద్దరినీ కాదని పూసరాజు అనే వ్యక్తికి కట్టబెట్టింది. ఇక్కడ కాంగ్రెస్ నుంచి బరిలో ఉన్న అంజన్కుమార్ యాదవ్కు లైన్ క్లియర్ చేసింది. పరోక్షంగా కాంగ్రెస్ గెలుపునకు ఆ రెండు పార్టీలు కలిసిపోయాయి.
గోషామహల్ కాంగ్రెస్ టికెట్ మొగిలి సునీత రావుకు దక్కింది. వాస్తవానికి ఈమె అంబర్పేట, ఖైరతాబాద్లో దరఖాస్తు చేసుకుంది. అక్కడ కాదని బీజేపీ అభ్యర్థిని గెలిపించడం కోసం కాంగ్రెస్ ఆమెకు అడగని గోషామహల్ను అప్పగించింది.
నాంపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి ఫిరోజ్ ఖాన్ గెలుపు కోసం రహస్య ఒప్పందంలో భాగంగా బీజేపీ రాహుల్ చంద్ర అనే వ్యక్తికి టికెట్ ఖారారు చేసిందని ఆ పార్టీకి చెందిన నాయకులు చర్చించుకుంటున్నారు.
కంటోన్మెంట్ నియోజకవర్గంలో గద్దర్ కూతురు వెన్నెలకు కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది. ఈమెను గెలిపించడం కోసం కంటోన్మెంట్ నుంచి బీజేపీ నాన్ లోకల్ వ్యక్తికి టికెట్ ఇవ్వడం గమనార్హం. అదే నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి కూతురు కూడా దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే.
మేడ్చల్లో కాంగ్రెస్ అభ్యర్థి వజ్రేశ్ యాదవ్ను గెలిపించుకోవడం కోసం అంతర్గత ఒప్పందంలో భాగంగా అదే నియోజకవర్గానికి టికెట్ ఆశించిన రూరల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు విక్రమ్ రెడ్డిని కాదనీ ప్యారాచూట్ నాయకుడికి టికెట్ అప్పగించిందని ఆ పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
కూకట్పల్లి కాంగ్రెస్ అభ్యర్థి బండి రమేశ్పై బీజేపీ హరీశ్ రెడ్డి, మాధవరం కాంతారావు, వడ్డెపల్లి రాజేశ్వర్ రావును కాదని పొత్తు నెపంతో జనసేన నాయకుడు ప్రేమ్ కుమార్కు అప్పగించారు. వీటన్నింటినీ చూస్తూ.. కాంగ్రెస్, బీజేపీలు ఓటమిని అంగీకరించి చేతులు కలిపి ముందుకుసాగుతున్నట్లు ఆయా పార్టీలకు చెందిన నాయకులే చర్చించుకుంటున్నాయి.