రూ.2కోట్లతో రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన
మల్కాజిగిరి,మే 26: దశాబ్దాల రోడ్డు సమస్యను సరిష్కరించామని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. గురువారం మచ్చ బొల్లారం డివిజన్ సాయి బృందావన్కాలనీ నుంచి కొంపల్లి ఐస్ ఫ్యాక్టిరీ వరకు రూ.2కోట్లతో రోడ్డు నిర్మాణపనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. సేహ కాలనీ ఆర్చీని ప్రారంభించి మొక్కలు నాటారు. కాశీపురం కాలనీలో స్థానికులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు మాట్లాడుతూ రోడ్డు గుంతలు పడడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నట్లు గుర్తించామని అన్నారు. అధికారులతో రోడ్డు నిర్మాణపనుల కోసం సర్వే చేయించి అవసరమైన నిధుల కోసం ప్రభుత్వానికి నివేదికలు పంపామన్నారు.
ప్రభుత్వం పరిశీలించి రూ.2కోట్లను మంజూరు చేసిందని అన్నారు. కాలనీలలో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణనులు దాదాపు పూర్తిచేశామని అన్నారు. ఇంటింటికీ నల్లా కనెక్షన్లు ఇచ్చామని, కొత్తగా వెలిసిన కాలనీల్లో ప్రజలకు మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. విద్యుత్ సరఫరా కోసం త్రిఫేజ్ లైన్ను ఏర్పాటు చేస్తామన్నారు. పార్కుల స్థలాన్ని కబ్జాచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.కార్యక్రమంలో డీఈ మహేశ్, కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్, కొండల్రెడ్డి, పరమేశ్, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.