మియాపూర్, ఏప్రిల్ 3 : కేంద్రంలో ని బీజేపీ ప్రభుత్వం అధిక ధరలతో పేద, మధ్యతరగతి ప్రజలపై భారం మోపుతుంటే, రాష్ట్రంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలుస్తున్నదని ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ అన్నారు. మియాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ అధ్యక్షతన సోమవారం విశ్వనాథ గార్డెన్స్లో జరిగింది.
ఈ కార్యక్రమానికి విప్ గాంధీ ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రం విశేష ప్రగతి సాధించి దేశం దృష్టిని ఆకర్షించే స్థాయికి ఎదిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అసత్య ప్రచారాలను సమర్థంగా తిప్పికొట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం రూ. 8500 కోట్ల నిధులను వెచ్చించి 11 డివిజన్లలో ఎన్నో అభివృద్ధి పనులను చేపట్టామన్నారు. రెండు దఫాలుగా తన విజయంలో కార్యకర్తల కృషే అధికమని, వారిని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలు, మహిళా నేతలు తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్లో చేరికలు
మియాపూర్ డివిజన్లోని ఆయా కాలనీలకు చెందిన సుమారు 500 మంది యువకులు కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ఆధ్వర్యంలో విప్ గాంధీ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. మియాపూర్ డివిజన్ ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా యువతకు గులాబీ కండువాలు కప్పి విప్ గాంధీ వారిని పార్టీలోకి ఆహ్వానించారు.