చంపాపేట, ఆగస్టు 25 : బీఆర్ఎస్ కార్యకర్తలపై బీజేపీ రాళ్లదాడి చేసింది. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్ కార్యకర్తలపై బీజేపీ కార్యకర్తలు గూండాల్లా వ్యవహరించారు. శుక్రవారం ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డికి చంపాపేట కార్పొరేటర్ వంగా మధుసూదన్రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ మహిళా వింగ్ కార్యకర్తలు కర్మన్ఘాట్ ఓల్డ్ విలేజీలోని కార్పొరేటర్ వంగ మధుసూదన్రెడ్డి ఇంటి ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులపై బీజేపీ కార్యకర్తలు రాళ్లతో దాడి చేశారు. ఈ ఘర్షణలో బీఆర్ఎస్ కార్యకర్తలు చేగోని మల్లేశ్గౌడ్, గోలెకర్ మహేశ్కుమార్కు తీవ్ర గాయాలు కాగా, మహిళా కార్యకర్తలు గోకుల్ సరోజ, గౌని అనసూయ, సర్దార్ రజినిలకు స్వల్పగాయపర్చారు. ఈ దాడిలో 3 తులాల బంగారు పుస్తెలతాడును బీజేపీ కార్యకర్తలు అపహరించారని సర్దార్ రజిని ఆరోపించారు.
ఎమ్మెల్యే సుధీర్రెడ్డిని అసభ్య పదజాలంతో దూషించినందుకు తాము నిరసన తెలియజేస్తే బీజేపీ కార్యకర్తలతో రాళ్లదాడి చేయిస్తావా.. ఇక నీ ఆగడాలు సహించబోమంటూ బీఆర్ఎస్ మహిళాలోకమంతా కార్పొరేటర్ వంగ మధుసూదన్రెడ్డి ఇంటి సమీపంలోని వివేకానంద విగ్రహం వద్ద పెద్దఎత్తున ధర్నా నిర్వహించారు. నల్లమాస్కులు ధరించి అక్కడే నిరసన ప్రదర్శనలు చేశారు. సమాచారం అందుకున్న సరూర్నగర్, ఎల్బీనగర్ పోలీసులు అక్కడికి చేరుకుని బీఆర్ఎస్ శ్రేణులకు సర్దిచెప్పి అక్కడి నుంచి పంపించి బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఎల్బీనగర్, ఆగస్టు 25 : ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చంపాపేట కార్పొరేటర్ వంగా మధుసూదన్రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ చైతన్యపురి బీఆర్ఎస్ నాయకులు శుక్రవారం చైతన్యపురి పోలీసులకు ఫిర్యాదు చేశారు. చైతన్యపురి డివిజన్ బీఆర్ఎస్ నాయకుడు సోంటి చంద్రశేఖర్రెడ్డి, డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట మహేశ్ యాదవ్, మాజీ అధ్యక్షుడు కోతి నర్సిరెడ్డి ఆధ్వర్యంలో వంగ మధుసూదన్రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కృష్ణ, శ్రీహరి, జాన్ కిరణ్, ప్రవీణ్చారి, జలంధర్, పులి కిరణ్, నరేశ్, సాయి, నవీన్, కల్యాణ్, శివ, రాజు తదితరులు ఉన్నారు.
చంపాపేట డివిజన్ పరిధి దుర్గాభవానీనగర్ కాలనీలో గత రెండురోజుల కిందట ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అదే చోటే తాను కూడా పనులు ప్రారంభిస్తున్నట్లు అక్కడే శంకుస్థాపన చేస్తానని స్థానిక కార్పొరేటర్ వంగ మధుసూదన్రెడ్డి గురువారం యత్నించాడు. ఈ క్రమంలో అక్కడే సమీపంలో ఉన్న ఐఎస్ సదన్ పోలీసులు అందుకు అడ్డు చెప్పారు. దీంతో ఆవేశంతో రగిలిపోయిన కార్పొరేటర్ మధుసూదన్రెడ్డి పోలీసుల సాక్షిగా ఎమ్మెల్యే సుధీర్రెడ్డిని అసభ్య పదజాలంతో దూషించాడు.