సిటీబ్యూరో, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్.. ఈ పేరు వింటే ప్రతిపక్షాల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఆ పార్టీపై ప్రజల్లో ఉన్న అభిమానం ముందు.. కాంగ్రెస్, బీజేపీలు నిలవలేకపోతున్నాయి. ఏ గల్లీ చూసినా గులాబీ జెండాలే.. ఏ ఓటర్ను కదిలించినా కారు ముచ్చటే.. ఏ ఇంటిని చూసినా కేసీఆర్ మాటే.. అంతలా బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లో స్థానం సంపాదించుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులపై బరిలో దిగాలంటే కమలం పార్టీ కంగారు పడుతున్నది. దీటైన అభ్యర్థులు లేక ఆ పార్టీ నాయకులు పక్క పార్టీల వైపు చూస్తున్నట్టు తెలుస్తున్నది.
రెండో జాబితాతో కాంగ్రెస్లో రేగిన చిచ్చుకు చాలా మంది ఆశావహులు హస్తంపై ఆగ్రహంతో ఊగిపోతున్నారు. పార్టీ కోసం కొన్నేండ్లుగా పనిచేస్తున్న తమని కాదని.. ప్యారాచూట్ నేతలకు టికెట్లు ఇవ్వడం, డబ్బులకు సీట్లు అమ్ము కోవడమేంటని కాంగ్రెస్ పార్టీ నాయకులు బహిరంగంగానే ఆ పార్టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలో పార్టీకి దూరమవ్వాలనుకునే వారిని కాషాయం పార్టీ సంప్రదిస్తున్నట్టు తెలుస్తోంది.
కొంతమంది ఫోన్లు చేసి పార్టీలోకి రావాలని ఆహ్వానం కూడా పంపిస్తున్నారని సమాచారం. అయితే, వారు కమలంలోకి వెళ్లడానికి నిరాకరిస్తున్నట్టు తెలుస్తోంది. గెలిచే పార్టీ బీఆర్ఎస్లోకి వెళితే రాజకీయ భవిష్యత్తు ఉంటుందని ఆలోచిస్తున్నారు. అందులో భాగంగానే కాంగ్రెస్ అసంతృప్తులు అధికార పక్షంలో చేరుతున్నారు. ఈ చేరికలు మరింతగా పెరగనున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
మరోవైపు తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఎన్నికల బరిలో ఉండటం లేదని అధిష్ఠానం ప్రకటించింది. దీంతో తెలుగు తమ్ముళ్లు పార్టీ కార్యాలయంలో తన్నులాటకు దిగారు. ఓటమి ఖాయమని తెలిసే ఆ పార్టీ అధిష్ఠానం పోటీ నుంచి తప్పుకున్నట్టు తెలిసింది. నిరాశతో ఉన్న కొందరు తెలుగు తమ్ముళ్లు కూడా బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లడానికి మంతనాలు సాగిస్తున్నారని సమాచారం. హైదరాబాద్లో ఉన్న ఆంధ్ర సెటిలర్స్ అంతా బీఆర్ఎస్ పార్టీకే జై కొడుతున్నారు. ఇప్పటికే చాలా మంది బీఆర్ఎస్ కండువాలు కప్పుకున్నారు. ముఖ్యంగా కూకట్పల్లి, జూబ్లీహిల్స్, శేరిలింగంపల్లి, సనత్నగర్, ఖైరతాబాద్లో ఉన్న తెలుగుదేశం క్యాడర్ అంతా బీఆర్ఎస్లోకి వెళ్లడానికి ఆసక్తి చూపించడం విశేషం.