సభ నిర్వహించిన ప్రాంతంపై శీతకన్ను
బకాయిలు, అభివృద్ధిపై కనీసం దృష్టి పెట్టని బీజేపీ నేతలు
రాజకీయమే తప్ప..
సంక్షేమం, అభివృద్ధి గురించి ప్రకటనలు చేయని వైనం
సికింద్రాబాద్, జూలై 3: ఊకదంపుడు ఉపన్యాసాలు….రాజకీయ విమర్శలు తప్ప.. రాష్ర్టానికి చేయాల్సిన సాయంపైనా బీజేపీ నాయకులు ఊసెత్తకపోవడం గమనార్హం. అంతిచ్చాం….ఇంతిచ్చాం..అనే వ్యాఖ్యలే తప్ప…కేంద్ర పరిధిలోని కంటోన్మెంట్ ప్రాంతానికి ఇవ్వాల్సిన బకాయిలపై మాత్రం నోరుమెదపలేదు. కంటోన్మెంట్ ప్రాంతంలోని పరేడ్ మైదానంలో సభ నిర్వహించినా, ఇక్కడి ప్రాంతానికి ఏమి చేశామో చెప్పలేని దుస్థితిలో కమలం డోలాయమానంలో పడింది.
బకాయి నిధుల విడుదలపై నోరు మెదపలేదేం..?
కంటోన్మెంట్ ప్రాంత అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని నిత్యం నోరు పారేసుకునే రాష్ట్ర బీజేపీ నాయకత్వం…..మోదీ సభలో కనీసం ఈ ప్రాంత అభివృద్ధిపై మాట్లాడకపోవడంపై జనం ముక్కున వేలేసుకుంటున్నారు. కేంద్ర పథకాలు అమలు కాని ప్రాంతంలో సుమారు రూ.680 కోట్ల బకాయిలు ఉన్నా విడుదల చేయకుండా, దానిపై మాట్లాడే సాహసం చేయలేని స్థితిలో కాషాయ నేతలు పడ్డారు. నిధులు విడుదల చేస్తేనే కదా అభివృద్ధి సాగుతుందనే కనీస పరిజ్ఞానం లేకుండా వ్యవహరించిన తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రక్షణ శాఖలో కీలకంగా వ్యవహరిస్తున్న సికింద్రాబాద్, కంటోన్మెంట్పై మాత్రం మాట్లాడకపోవడం విడ్డూరంగా ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
రాష్ర్టానికి ఏం చేశారో చెప్పలేని దుస్థితి…
తెలంగాణ రాష్ర్టానికి ఏం చేశారో చెప్పలేని స్థితిలో బీజేపీ పడింది. విభజన చట్టంలో ఉన్న నియోజకవర్గాల పెంపుదలపై మాట్లడలేని దుస్థితి నెలకొంది. గతంలో రాష్ట్రంలో వరదలు వస్తే నిధులు ఇవ్వని కేంద్రం, గుజరాత్లో మాత్రం వరదలు వస్తే వేలకోట్ల సాయం చేసి, రాష్ట్రంపై చిన్నచూపు చూసింది. ఎన్నికలు ఎక్కడ ఉంటే అక్కడ నిధుల వరద పారించిన ప్రధాని మోదీ, తెలంగాణకు మాత్రం ఇవ్వాల్సిన నిధులు ఇవ్వడం లేదు.
– జి. సాయన్న, ఎమ్మెల్యే, కంటోన్మెంట్
సభ ఇక్కడ….నిధులు ఎక్కడ…?
ఎనిమిదేండ్ల మోదీ పాలనలో విధ్వంసాలు తప్ప..ఒరగబెట్టింది ఏమీ లేదు. హస్తినకు ప్రయాణం అన్న మాటలు సీఎం కేసీఆర్ నోటి వెంట వచ్చాయో లేదో..కమలనాథులు భాగ్యనగరం మీద జాతీయ కార్యవర్గ సమావేశాలు, సభల పేరుతో దండయాత్రకు దిగారు. కనీసం కంటోన్మెంట్ ప్రాంతంలో సభ పెట్టినా, దీనిపై మాట్లాడకపోవడం సిగ్గుచేటు. బకాయి నిధులు విడుదల కాకపోవడంతో అభివృద్ధిలో కుంటుపడుతున్నా.. దానిపై పల్లెత్తు మాటెత్తకపోవడం గమనార్హం. ఇక్కడి కాషాయ నేతలు మళ్లీ పాడిన పాటే పాడుతూ.. నేటి నుంచి రోడ్ల మీద తిరిగితే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారు.
– మర్రి రాజశేఖర్రెడ్డి, మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్చార్జి
రోడ్ల మూసివేతలు కనిపించలేదా…
కంటోన్మెంట్లో సభ నిర్వహించినా.. ఇక్కడి ప్రాంత సమస్యలపై బీజేపీ నేతలు పట్టనట్లుగా వ్యవహరించడం ఏమిటి. నిత్యం ఈ ప్రాంతంలో మిలిటరీ అధికారులు చీటికి మాటికి రోడ్లను మూసివేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నా కనీసం రాష్ట్ర నేతలు సైతం నోరు మెదపలేదు. బకాయిల విడుదలలోనూ వివక్ష, రోడ్ల విస్తరణ, స్కైవేల నిర్మాణాలు, భూ బదలాయింపుపై సభలో మాట్లాడుతారనుకుంటే డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అంటూ రాజకీయ ఉపన్యాసాలకే ప్రాధాన్యమివ్వడం దారుణం.
– జక్కుల మహేశ్వర్రెడ్డి, మాజీ ఉపాధ్యక్షుడు, కంటోన్మెంట్ బోర్డు