వనస్థలిపురం, డిసెంబర్ 7: టిప్ టాప్గా కారులో వస్తాడు.. నకిలీ తాళం చెవి సహాయంతో పార్కింగ్ చేసిన ఖరీదైన బైక్లను మాయం చేస్తాడు. వరుస దొంగతనాలకు పాల్పడిన ఓ పాత నేరస్తుడితో సహా ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. రూ.16 లక్షల విలువజేసే ద్విచక్రవాహనాలు, కారు, ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తం రెడ్డి బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించాడు. హస్తినాపురం క్రిస్టియన్ కాలనీలో నివాసముండే బండ్రవల్లి రాకేశ్ (21) ఈజీ మనీకి అలవాటు పడ్డాడు. బైక్ దొంగతనాలు చేయడంలో ఆరి తేరాడు. దానినే వృత్తిగా ఎంచుకున్నాడు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు రాకేశ్ ఐ20 కారులో తిరుగుతూ బైక్ దొంగతనాలకు పాల్పడుతున్నాడు.
ఎక్కువ డబ్బులు రావాలన్న ఆశతో రాయల్ ఎన్ఫీల్డ్, బజాజ్ పల్సర్ వంటి పెద్ద బైక్లను చోరీ చేస్తున్నాడు. సుష్మా చౌరస్తాలో ఉన్న కీ మేకర్ మహ్మద్ సోహిల్ (25)తో నకిలీ తాళం చెవిలు తయారు చేసేందుకు ఒప్పందం చేసుకున్నాడు. రాకేశ్ చోరీ చేసేందుకు ఎంచుకున్న వాహనం పేరు, మోడల్, తాళం, తదితర సమాచారంతో మహ్మద్ సోహిల్ నకిలీ తాళం చెవి తయారు చేసి ఇచ్చాడు. ఆ తాళం చెవి సహాయంతో పార్కింగ్ చేసిన బైక్లను రాకేశ్ దొంగిలిస్తున్నాడు. చోరీ చేసిన బైక్లను అతడు తనకు తెలిసిన వారికి విక్రయిస్తున్నాడు.
తీగలాగితే డొంక కదిలింది…
సరూర్నగర్ పోలీసులు గతంలో నిందితుడిని చోరీ కేసుల్లో అరెస్టు చేశారు. జైలు నుంచి వచ్చిన రాకేశ్ తిరిగి దొంగతనాలు మొదలుపెట్టాడు. గతనెల 21న ప్రశాంత్నగర్ నివాసి అంగోతు మోషాకు చెందిన పల్సర్ బైక్ పోయింది. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బుధవారం వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులకు రాకేశ్ అనుమానాస్పదంగా కనిపించాడు. అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో నేరాలు బయటపడ్డాయి. దీంతో అతడికి సహకరించిన కీ మేకర్ సోహిల్, బైక్లను కొనుగోలు చేసిన బానాల అజయ్ (21), కొప్పు శివ(20), దేవరపాగ శివకుమార్(22), నెక్కొండ సంతోష్(21)ను అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి రూ. 16 లక్షల విలువజేసే 13 బైక్లు, 1 కారు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాను పట్టుకున్న పోలీసులను ఏసీబీ అభినందించి, రివార్డును అందజేశాడు. ఈ సమావేశంలో వనస్థలిపురం సీఐ కోలా సత్యనారాయణ, డీఐ వెంకట్, డీఎస్ఐ జగన్, సిబ్బంది పాల్గొన్నారు.