గోల్నాక, డిసెంబర్ 26 : పేద, మధ్య తరగతి ప్రజలకు ఆపత్కాలంలో సీఎం రిలీఫ్ ఫండ్ అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. సోమవారం గోల్నాకలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అంబర్పేట దుర్గానగర్కు చెందిన ఎన్.యాదగిరికి సీఎంఆర్ఎఫ్ నుంచి మంజూరైన రూ.30వేల చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అనారోగ్యానికి గురై దవాఖానల్లో చికిత్స పొందుతున్న అర్హులైన ప్రతి ఒక్కరికీ సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఆర్థిక సాయం అందజేస్తున్నామన్నారు. తాను ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించిన మూడేండ్ల కాలంలో కోట్లాది రూపాయలు బాధితులకు అందజేశామని తెలిపారు. గోల్నాక తులసీనగర్ కాలనీలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశామని తెలిపారు. ఆపత్కాలంలో బాధితులు వారి కుటుంబ సభ్యులు ఎవరైనా క్యాంపు కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. ఎప్పటికప్పుడు సీఎం కార్యాలయ అధికారులతో సంప్రదింపులు జరుపుతూ.. వీలైనంత త్వరగా బాధితులకు చెక్కులు అందే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ కోరారు.