రవీంద్రభారతి, మే 19 : కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానం ప్రకారం సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 20 శాతం నుంచి 42 శాతం వరకు పెంచాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో 40 బీసీ సంఘాలు, విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలతో కలిసి ఆర్.కృష్ణయ్య విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లను పెంచిన తర్వాతనే సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. సమగ్ర బీసీ కులగణన చేపట్టి చట్ట సభలో బీసీ రిజర్వేషన్లను ప్రవేశపెడుతామని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్గాంధీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారని, పెంచిన తర్వాతనే ఎన్నికలను నిర్వహించాలని, లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా బీసీలను చైతన్యం చేసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు.
అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీసీలకు కాంగ్రెస్ పార్టీ మొండి చేయి చూపిందని మండిపడ్డారు. ఇప్పటికైనా సీఎం రేవంత్రెడ్డి స్పందించి సమగ్ర కులగణన చేపట్టాలని లేనిపక్షంలో ఎమ్మెల్యేలు, మంత్రులను గ్రామాల్లో తిరుగనివ్వమని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీసీ నేతలు సి.రాజేందర్, శ్రీనివాస్, అనంతయ్య, పర్వతాలు, కృష్ణమూర్తి, మహిళా బీసీ నేతలు భాగ్యలక్ష్మి, శారద తదితరులు పాల్గొన్నారు.