రవీంద్రభారతి, సెప్టెంబర్ 19 : బతుకమ్మ పండుగకు ఘన చరిత్ర ఉన్నదని, ఆంధ్ర పాలకులు నిర్వీర్యం చేసే ప్రయత్నం చేశారని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. శ్రీశాంతిక్రిష్ణ సేవా సమితి 37వ వార్షికోత్సవం సందర్భంగా సహస్ర మహోత్సవాలు సోమవారం రవీంద్రభారతిలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరై ప్రసంగించారు. బతుకమ్మ పండుగకు ఎంతో చరిత్ర ఉందని తెలిపారు.
పువ్వులను పూజించే ఏకైక పండుగ బతుకమ్మ పండుగ అని అన్నారు. మంత్రి వి.శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత తెలుగు సాంస్కృతిక, సంప్రదాయాలకు పెద్దపేట వేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్, ప్రముఖ సంఖ్యాశాస్త్ర నిపుణులు దైవజ్ఞశర్మ, సేవా సమితి సంస్థ అధ్యక్షుడు శాంతిక్రిష్ణ, వంశీ సంస్థల అధినేత డా.వంశీ రామరాజు తదితరులు పాల్గొన్నారు. అనంతరం మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు దంపతులను సత్కరించారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో పనిచేసిన సేవామూర్తులకు అవార్డులను ప్రదానం చేశారు.