మలక్పేట, ఏప్రిల్ 19: పేద, మధ్య తరగతి ప్రజలకు వైద్య సేవలు అందుబాటులోకి తేవాలన్న సంకల్ఫంతో ప్రభుత్వం ఏర్పాటుచేసిన బస్తీ దవాఖానాలు సత్ఫలితాలనిస్తున్నాయి. కాలనీలు, బస్తీల ప్రజల ఆరోగ్యాలకు భరోసానిస్తున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రులద్వారా మెరుగైన వైద్యసేవలు అందించాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ కలలను సాకారం చేసే దిశగా ముందుకు సాగుతున్నాయి. మెరుగైన వైద్యసేవలు కేవలం కార్పొరేట్ ఆసుపత్రుల్లోనే లభిస్తాయన్నది ఒకప్పటి మాట. కాని ప్రస్తుతం పరిస్థితి మారింది. ప్రభుత్వం వైద్య, ఆరోగ్యం పట్ల తీసుకుంటున్న ప్రత్యేక శ్రద్ధ, కల్పిస్తున్న వసతులు, అందిస్తున్న నాణ్యమైన వైద్య సేవలతో ఒకప్పుడు ప్రభుత్వ దవాఖానాలంటేనే జడుసుకునే ప్రజలు, ఇపుడు బస్తీ దవాఖానాలే మేలంటూ దవాఖానాల ముందు బారులు తీరుతున్నారు. నిత్యం వైద్య సేవలకోసం వచ్చే రోగులతో బస్తీ దవాఖానాలు కిటకిటలాడుతున్నాయి. అందుకు గడ్డి అన్నారం బస్తీ దవాఖానాలో నమోదవుతున్న ఓపీ గణాంకాలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. గడ్డిఅన్నారంలో ఏర్పాటుచేసిన బస్తీ దవాఖానకు నిత్యం రోగులు బారులు తీరుతున్నారు. సుమారు 5 వేల జనాభా కలిగిన గడ్డిఅన్నారం ప్రాంతంలోని బస్తీ దవాఖానాలో నిత్యం ఓపీ 80-90 వరకు నమోదవుతుండగా, సోమ, మంగళ, బుధవారాల్లో చర్మ సంబంధమైన వైద్యసేవలు అందిస్తున్నందున మూడు రోజుల్లో ఓపీ మరింత ఎక్కువగా నమోదవుతుందని బస్తీ దవాఖానా మెడికల్ అధికారి డాక్టర్ నిద ఫాతిమా తెలిపారు. వారానికి 500-600 వరకు ఓపీ నమోదవుతుండగా, ల్యాబ్ టెస్టులు 130-150 వరకు నమోదవుతున్నాయని ఆమె వివరించారు.
నెలలో రెండుసార్లు ఇమ్యునైజేషన్, మహిళలకు నెలసరి వైద్య పరీక్షలతోపాటు, జ్వరం, బీపీ, షుగర్, దగ్గు, ఉబ్బసం, వాంతులు, విరేచనాలు గాయాలకు చికిత్సలతోపాటు ల్యాబ్టెస్టులు చేస్తూ గర్భిణిలకు పురుడు పోస్తున్నారు. కాంప్లికేటేడ్ కేసులతోపాటు నాన్ కమ్యూనికేబుల్, సీజనల్ వ్యాధులకు చికిత్సలు అందిస్తున్నారు.
గడ్డి అన్నారం బస్తీ దవాఖానలో నిత్యం అందించే వైద్య సేవలతోపాటు టెలిమెడిసిన్ద్వారా ఉస్మానియా దవాఖానా వైద్యులు కార్పొరేట్ వైద్యాన్ని అందిస్తున్నారు. సోమవారం, శుక్రవారం-డెర్మటాలజీ, గైనకాలజీ, మంగళవారం-ఆప్తాల్మాలజీ, బుధవారం ఈఎన్టీ వైద్య పరీక్షలు, మందుల పంపిణీ, గురువారం-పీడియాట్రిక్స్, శస్త్ర చికిత్సలు, శుక్రవారం- సైకియాట్రీ, శనివారం-ఆర్థోపెడిక్స్ వైద్య సేవలు అందిస్తున్నారు. తెలంగాణా డయాగ్నాస్టిక్ సెంటర్ద్వారా 50 రకాల వైద్య పరీక్షలు- వంద రకాల మందులు పంపిణీ చేస్తున్నారు. ప్రజలకు మెరుగైన వైద్యంతోపాటు వంద రకాల మందులను అందిస్తున్నారు.