సిటీబ్యూరో, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ): నగరంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై అధ్యయనం చేశారు. రాత్రి వేళల్లోనే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నట్టు గుర్తించారు. ప్రమాదాలు ఎక్కడ జరుగుతున్నాయి.. ఎందుకు జరుగుతున్నాయి.. కారణాలపై విశ్లేషించారు. ఈ ప్రమాదాలను కట్టడి చేసేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు పలు చర్యలు చేపట్టారు. తీసుకోవాల్సిన చర్యలపై మార్చి నెల నుంచి అధ్యయనం చేశారు. పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాల మేరకు ఇటీవలే నగర వ్యాప్తంగా సోలార్ లైట్లతో కూడిన అధునాతన బారికేడ్లను ఏర్పాటు చేశారు. సంబంధిత అన్ని శాఖల సహాయంతో సమస్యను పరిష్కరించాలని నిర్ణయించారు. జీహెచ్ఎంసీ సహకారంతో లైటింగ్, రోడ్డు ఇంజినీరింగ్.. వంటి అంశాలకు ప్రాధాన్యతనిచ్చారు.
నగరంలో ఉన్న 25 ట్రాఫిక్ పోలీస్స్టేషన్ల పరిధిలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న 22 ప్రాంతాలను గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడమే కాకుండా.. బారికేడ్ల వద్ద సిబ్బంది కూడా విధులు నిర్వహిస్తారు. ఇప్పటి వరకు ఆయా ప్రాంతాల్లో 250 బారికేడ్లు ఏర్పాటు చేశారు. త్వరలో మరో 250 ఏర్పాటు చేయనున్నారు. బారికేడ్ల పర్యవేక్షణకు ఒక ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో జోన్కు ఒక సబ్ ఇన్స్పెక్టర్ను నియమించారు. ఈ బారికేడ్ల ఏర్పాటుతో ఆశించిన ఫలితాలు వస్తున్నాయని ట్రాఫిక్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది రాత్రి 11 నుంచి ఉదయం 6 గంటల వరకు జరిగిన ప్రమాదాలు చాలా వరకు తగ్గాయని చెప్పారు. గత ఏడాది 121 ప్రమాదాలు జరుగగా, ఈ ఏడాది నవంబర్ వరకు 97 ప్రమాదాలు నమోదైనట్లు తెలిపారు.