Hyderabad | సిటీబ్యూరో, జనవరి 31 (నమస్తే తెలంగాణ) : నగర శివారు ప్రాంతాలు శరవేగంగా విస్తరిస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధి దాటిన తర్వాత ఉన్న గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో నిబంధనలకు విరుద్ధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు వెంచర్లు చేస్తున్నారు. పాత తేదీల్లో గ్రామ పంచాయతీ అనుమతులను సృష్టించి చిన్న బిల్డర్ల ద్వారా గుట్టు చప్పుడు కాకుండా నిర్మాణాలు సైతం చేపడుతున్నారు. ఇలా శివారు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా ఏర్పాటవుతున్న వెంచర్లకు విద్యుత్ శాఖ అధికారులు దర్జాగా విద్యుత్ లైన్లు, ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేస్తున్నారు. అందుకు ప్రత్యేక నిదర్శనం బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పలు చోట్ల 2, 3 ఎకరాల్లో చిన్న చిన్న లేఅవుట్లుగా చేసి, అందులో జీ ప్లస్ వన్ అంతస్థుల్లో స్థానిక బిల్డర్లతో ఇండ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. రియల్టర్లు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులను, స్థానిక ప్రజాప్రతినిధులను అటు వైపు కన్నెత్తి చూడకుండా మేనేజ్ చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్రమ వెంచర్లలో పాత అనుమతులతోనే ఇండ్ల నిర్మాణం పూర్తి చేస్తున్నారన్న ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి.
ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చాల్సిన ప్రభుత్వ అధికారులే అవినీతికి పాల్పడుతున్న పరిస్థితి ఇక్కడ ఉందని స్థానికులు పేర్కొంటున్నారు. నిబంధనల ప్రకారం ఈ ప్రాంతంలో లేఅవుట్ చేయాలంటే హెచ్ఎండీఏ లేదంటే మున్సిపల్ కార్పొరేషన్ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. దీని ప్రకారం ప్రభుత్వానికి ఫీజుల రూపంలో లక్షల్లో ఆదాయం వస్తుండగా, రోడ్ల కోసం 30శాతం, పార్కులు, ఇతర అవసరాల కోసం మరో 10శాతం భూమిని వదిలి పెట్టాల్సి ఉంటుంది. ఇవన్నీ చేయకుండా ఉండేందుకు పాత లేఅవుట్ అంటూ చెబుతూ 25 ఫీట్లతోనే రోడ్లను వేసి, పార్కుకు గజం స్థలం కూడా వదలకుండా ప్లాట్లను చేసి విక్రయిస్తున్నారు. అయితే చిన్న లేఅవుట్లన్నీ ఇండ్లకు సమీపంలోనే ఉండడంతో నేరుగా ఇంటి నిర్మాణం చేపట్టి విక్రయాలు చేసేలా బిల్డర్లకు వాటిని విక్రయిస్తున్నారు. మున్సిపల్ అధికారుల అవినీతికితోడు విద్యుత్ అధికారులు అనుమతి లేని వెంచర్లలో పెద్ద మొత్తంలో విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్ను సైతం ఏర్పాటు చేస్తుండటంతో నిర్మాణాలు శరవేగంగా చేపడుతున్నారు. ప్రభుత్వానికి ఆదాయాన్ని రాబట్టాల్సిన అధికారులే అడ్డదారుల్లో అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తూ తమ జేబులు నింపుకుంటున్నారనే ఆరోపణలు శివారు మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వ నిబంధనల ప్రకారం లేఅవుట్లను ఏర్పాటు చేసి, ప్రణాళికాబద్దమైన పట్టణీకరణ జరిగేలా ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.