మేడ్చల్, డిసెంబర్ 20 : రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో 8 లక్షల మంది ఆటో డ్రైవర్లు రోడ్డున పడ్డారని బీపీటీఎంఎం జాతీయ ప్రధాన కార్యదర్శి శంకర్ ఆవేదన వ్యక్తం చేశారు. మేడ్చల్ పట్టణంలో బుధవారం బీఎంఎస్ ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యంపై ఆటో డ్రైవర్లు ఆందోళన నిర్వహించారు. లోటస్ గృహ సముదాయం నుంచి వివేకానంద విగ్రహం వరకు, తిరిగి ప్రభుత్వ ఐటీఐ వరకు నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా బీపీటీఎంఎం జాతీయ ప్రధాన కార్యదర్శి శంకర్ మాట్లాడుతూ మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం ద్వారా ఆటో డ్రైవర్ల కుటుంబాలు 12 రోజులుగా పస్తులు ఉండాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. నగరాలు, పట్టణాల్లోని ఆటో డ్రైవర్ల పరిస్థితి మరింత దారుణంగా తయారైందన్నారు.
మహిళలు ఉచిత బస్సు సౌకర్యం కల్పించామన్నారా.? ఆటో డ్రైవర్లు ఏడాదికి రూ.12వేలు ఇవ్వమని అడిగారా అని ప్రశ్నించారు. ఉచిత బస్సు ప్రయాణ నిర్ణయాన్ని ప్రభుత్వం పునరాలోచించుకోవాలని, లేదంటే గ్రామ సచివాలయం నుంచి రాష్ట్ర సచివాలయం వరకు ఆటోలను హైర్ చేసుకొని, నెలకు రూ.30వేల వేతనం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆటో డ్రైవర్లు తమ కుటుంబ సభ్యులేనని, వారి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారన్నారు. వెంటనే అన్ని సంఘాల ఆటో డ్రైవర్లతో చర్చలు జరిపి, సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అప్పటి వరకు ఆందోళన కొనసాగిస్తామని, అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ ఆందోళనలో దాదాపు 500 మంది ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.