Hyderabad | బంజారాహిల్స్, మార్చి 17 : రాంగ్రూట్లో వచ్చి ప్రమాదానికి కారణం కావడమే కాకుండా బైక్ నడిపిస్తున్న వ్యక్తిపై రాడ్తో దాడి చేసి డబ్బులు లాక్కున్న వ్యక్తులను బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
వివరాల్లోకి వెళ్తే.. బంజారాహిల్స్ రోడ్ నెం 13లో నివాసం ఉంటున్న పి.రాఘవేంద్ర అనే యువకుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తుంటాడు. ఈ నెల 15న అర్థరాత్రి దాటిన తర్వాత మాదాపూర్లో సెకండ్ షో సినిమా చూసిన రాఘవేంద్ర తన బైక్మీద ఇంటికి బయలుదేరాడు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45నుంచి బాలకృష్ణ ఇంటివద్ద కుడివైపుకు తిరిగే సమయంలో రాంగ్రూట్లో వచ్చిన ఆటో బైక్ను డీకొట్టింది. అయితే సకాలంలో కంట్రోల్ చేయడంతో ప్రమాదం తప్పింది. రాంగ్రూట్లో ర్యాష్గా ఎందుకు వస్తున్నావంటూ ఆటోడ్రైవర్ను రాఘవేంద్ర ప్రశ్నించాడు.
దీంతో ఆటోడ్రైవర్ బూతులు తిట్టడంతో పాటు బైక్ను ఫాలో చేస్తూ కొంతదూరం వెంబడించి ఆటోను అడ్డుపెట్టారు. రాడ్తో దాడి చేయడంతో పాటు కేసు పెడ్తానంటూ బెదిరించి రూ.5వేలు వసూలు చేశాడు. అతడితో పాటు మరో వ్యక్తి జుబెయిర్ రాఘవేంద్రకు సాయం చేస్తున్నట్లు నటించి మరో రూ.1000 వసూలు చేశాడు. ఈ మేరకు బాధితుడు సోమవారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిపై బీఎన్ఎస్ 309(6) సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా దాడికి పాల్పడి డబ్బులు లాక్కున్న ఆటోడ్రైవర్ వీరప్ప నాయక్కు జుబైర్ అనే ఇద్దరూ స్నేహితుడే అని తేలింది. దీంతో వారిద్దరూ కలిసి ప్లాన్ ప్రకారమే డబ్బులు లాక్కున్నారని గుర్తించిన పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.