కవాడిగూడ, మార్చి 14: కేంద్రంలో ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లో గత తొమ్మిదేండ్ల బీజేపీ పాలనలో దళితులు, గిరిజనులు, మహిళలు, మైనారిటీలపై రెట్టింపు స్థాయిలో దాడులు పెరిగాయని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ఆరోపించారు. మంగళవారం ఇందిరాపార్కు ధర్నాచౌక్లో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం(కేవీపీఎస్) తెలంగాణ రాష్ట్ర కమిటీ, సామాజిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బీజేపీ పాలనలో దేశ వ్యాప్తంగా దళితులపై జరిగిన దాడులను నిరసిస్తూ రాజ్యాంగం, రిజర్వేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ కోరుతూ మహాధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన బీవీ రాఘవులు మాట్లాడుతూ.. బీజేపీ పాలనలో 2014లో 40,072 దాడులు జరిగితే 2021 నాటికి అవి 50,900 సంఘటనలకు పెరిగాయన్నారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో దళితులపై దాడులు, దౌర్జన్యాలు 300 రెట్లు పెరిగాయన్నారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు జాన్ వెస్లీ, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆర్. వెంకట్రాములు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్ బాబు, గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం. ధర్మానాయక్, చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ రాష్ట్ర నాయకులు పి.ఆశయ్య, ఏగొండ స్వామి, డీబీఎస్ రాష్ట్ర నాయకులు రమేశ్, జైబీమ్ మహాసేన రాష్ట్ర అధ్యక్షుడు మంచింటి అంజన్న, కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోడ సామ్యెల్, అతిమెల మాణిక్యం, జి. రాజు, పల్లెర్ల లలిత, రాష్ట్ర సహాయ కార్యదర్శిలు కోట గోపి, బొట్ల శేఖర్ రావు, రవి, రాష్ట్ర కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.