బంజారాహిల్స్, ఆగస్టు 11: మద్యం మత్తులో స్నేహితుడితో గొడవపడడంతో పాటు కర్రతో దాడికి పాల్పడ్డ ఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పారామౌంట్ కాలనీలో నివాసం ఉంటున్న మహ్మద్ గౌస్, ప్రేమ్ స్నేహితులు. అప్పుడప్పుడూ ఇద్దరూ కలిసి మద్యం సేవిస్తుంటారు. ఈ క్రమంలో రెండ్రోజుల క్రితం ఇద్దరూ కలిసి గౌస్ ఇంటిబయట కూర్చుని మద్యం సేవించారు.
మద్యం మత్తులో ప్రేమ్ ఇంటికి వెళ్లిన గౌస్ తలుపుతట్టడంతో తన ఇంటికి ఎందుకు వెళ్లావంటూ ప్రేమ్ గొడవకు దిగారు. మాటామాటా పెరగడంతో ఆగ్రహానికి లోనయిన ప్రేమ్ కర్రతో గౌస్ తలపై దాడి చేశాడు. దీంతో తీవ్రంగా గాయపడ్డ గౌస్ను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు బాధితుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.