సిటీబ్యూరో, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ): ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అభ్యర్థుల జైత్రయాత్ర జోరుగా సాగుతున్నది. నోటిఫికేషన్ కంటే ముందుగానే నియోజకవర్గాన్ని చుట్టేసిన నేతలు..రెండో విడత ప్రచారంలో సరైన వ్యూహాలతో ముందుకెళుతున్నారు. అభ్యర్థులు సైతం ఒకవైపు పాదయాత్రలు, మరోవైపు అన్ని వర్గాల మద్దతును కూడగట్టేందుకు ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు మీకు అన్ని విధాలుగా అండగా ఉన్న తమకు నవంబర్ 30వ తేదీన జరిగే ఎన్నికలలో మద్దతుగా నిలిచి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నారు.
ఇందులో భాగంగానే శనివారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మారేడ్పల్లిలోని తన నివాసంలో గుజరాతి, జైన్, రాజస్తానీ, బెంగాళి వర్గాలకు చెందిన ప్రతినిధులు, ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఇదే తరహాలో గ్రేటర్లోని అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తూ..గడిచిన తొమ్మిదిన్నరేళ్లలో హైదరాబాద్లో ప్రశాంత వాతావరణం ఉందని, అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వం కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నదన్నారు. మరి ఇటువంటి ప్రభుత్వాన్ని ఆదరించాలని బీఆర్ఎస్ అభ్యర్థులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇంటింటీ ప్రచారం, పాదయాత్రలు ఒకవైపు మరోవైపు కలిసివచ్చే నేతలను పార్టీలోకి ఆహ్వానిస్తూ నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేస్తున్నారు. నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాలతో క్యాడర్లో నూతనోత్తేజాన్ని నింపుతూ అందరినీ ఒక్క తాటిపైకి తీసుకువచ్చి అభ్యర్థుల గెలుపునకు బాటలు వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పదేండ్ల అభివృద్ధి, ఇటీవల సీఎం కేసీఆర్ ప్రకటించిన ఎన్నికల మ్యానిఫెస్టో ప్రచార అస్త్రంగా కాలనీలు, బస్తీలు కలియతిరుగుతూ ప్రజలను ఆకట్టుకుంటున్నారు.
కాంగ్రెస్, బీజేపీ పార్టీలు 65 ఏండ్లు పాలించిన అభివృద్ధి జరగలేదని, గడిచిన పదేండ్లలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం వందేండ్ల అభివృద్ధికి బాటలు వేసిందంటూ ప్రజల్లోకి బలంగా తీసుకుళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల ప్రచారంలో అన్ని పార్టీల కంటే ముందున్న బీఆర్ఎస్ ప్రత్యర్థి పార్టీల డిపాజిట్లను గల్లంతు చేయడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పావులు కదుపుతున్నారు. కలిసి వచ్చే ఇతర పార్టీల నేతలకు గులాబీ కండువాలు కప్పుతూ నియోజకవర్గంలో తిరుగులేని శక్తిగా ఎదుగుతూ ప్రతిపక్ష పార్టీలకు ముచ్చేమటలు పట్టిస్తున్నారు. దాదాపు రెండు నెలల గులాబీ శ్రేణుల ప్రచార శైలితో బీఆర్ఎస్ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలుపొందడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.