సిటీబ్యూరో, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ)/మేడ్చల్: నిషేధిత పత్తి విత్తనాలు రవాణా చేస్తున్న ఇద్దరిని సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు కలిసి పట్టుకున్నారు. నిందితుల వద్ద నుంచి రూ. 19.2 లక్షల విలువజేసే నిషేధిత పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. మంచిర్యాల జిల్లాకు చెందిన శివయ్య అలియాస్ సిద్దయ్య, సురేశ్ యాదవ్ గత కొన్నేండ్లుగా తెలంగాణ ప్రభుత్వం నిషేధించిన బిజి-3 నకిలీ పత్తి విత్తనాలను అమాయక రైతులకు విక్రయిస్తూ మోసం చేస్తున్నారు.
వీరు తమ సొంత వాహనాల్లోనే వెళ్లి కర్ణాటక, తదితర ప్రాంతాల నుంచి నకిలీ విత్తనాలను కొనుగోలు చేసి, తెలంగాణ రైతులకు విక్రయిస్తూ సొమ్ము చూసుకుంటున్నారు. ఈ క్రమంలో డ్రైవర్లు గడ్డం శ్రీకాంత్, నవీన్ కుమార్కు ట్రిప్పుకు రూ.5వేల చొప్పున చెల్లించి, కర్ణాటక నుంచి నకిలీ పత్తి విత్తనాలను మంచిర్యాలకు తెప్పిస్తున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా విత్తనాల బస్తాలపై ఉల్లిగడ్డల సంచులు వేసి రవాణా చేస్తున్నారు.
ఈ సమాచారం అందుకున్న ఎస్ఓటీ పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు సోమవారం తెల్లవారుజామున శామీర్పేటలోని రాజీవ్ హైవేపై నిఘా పెట్టి నకిలీ పత్తి విత్తనాలు తరలిస్తున్న వాహనాన్ని పట్టుకున్నారు. ఈ దాడుల్లో రూ.19లక్షల విలువజేసే 1.2టన్నుల నిషేధిత బిజి-3 పత్తి విత్తనాల బస్తాలు, వాటిపై ఉన్న 1,560 కిలోల ఉల్లిగడ్డల సంచులు, రవాణాను ఉపయోగించిన వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన మొత్తం సొత్తు విలువు దాదాపు రూ.30 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. డ్రైవర్లు గడ్డం శ్రీకాంత్, నవీన్కుమార్ను అరెస్టు చేశారు. తదుపరి విచారణ నిమిత్తం కేసును శామీర్పేట పోలీసులకు అప్పగించారు.