మహానగరంతో పాటు శివారులోనూ ముంపు ముప్పునకు శాశ్వతంగా చెక్ పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులోభాగంగానే బల్దియా చేపట్టిన స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రాం (ఎస్ఎన్డీపీ) ద్వారా అభివృద్ధి ఫలాలు విడతల వారీగా అందుబాటులోకి వస్తున్నాయి. తొలి దశలో రూ. 985.45 కోట్లతో పనులు చేపట్టగా, 80 శాతం పూర్తయ్యాయి. మిగిలినవి కూడా యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎస్ఎన్డీపీ రెండో దశ కోసం భారీ స్థాయిలో ప్రతిపాదనలు సిద్ధం చేసింది బల్దియా. ఇందులో గ్రేటర్తో పోలిస్తే శివారులోనే పనులు అధికంగా ఉన్నాయి. రూ. 5135.15కోట్లతో రూపొందించిన ఈ ప్రతిపాదనలను అధికారులు ప్రభుత్వానికి అందజేశారు. జీహెచ్ఎంసీకి సంబంధించి రూ. 2141.22 కోట్లతో 148 పనులు, శివారులో రూ.2993. 93 కోట్లతో 267 చోట్ల పనులు చేపట్టేందుకు ప్రతిపాదించారు. అనుమతులు రాగానే పనులు చేపట్టనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
సిటీబ్యూరో, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ) : జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న స్ట్రాటజిక్ నాలా అభివృద్ధి పథకం (ఎస్ఎన్డీపీ) తొలి విడత రూ. 985.45కోట్ల పనులు దాదాపుగా 80శాతం మేర పూర్తయ్యాయి. జీహెచ్ఎంసీ, శివారుతో కలిపి 57 చోట్ల పనులకు గానూ రెండు చోట్ల పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువచ్చారు. 46 చోట్ల పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతుండగా, వచ్చే నెల మొదటి వారం కల్లా 17, నెలాఖరు నాటికి 15 చోట్ల అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఇటీవల పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు ప్రకటించారు.
హుస్సేన్సాగర్ సర్ప్లస్ నాలా, బుల్కాపూర్ నాలా పనులను వచ్చే ఏప్రిల్ నాటికల్లా మొదటి విడుత పూర్తి చేసి, రెండో విడత ఎస్ఎన్డీపీ పనులు చేపడతామని మంత్రి కేటీఆర్ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే ఎస్ఎన్డీపీ రెండో దశలో రూ. 5135.15 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసిన అధికారులు ప్రభుత్వానికి అందజేశారు. ఇందులో జీహెచ్ఎంసీకి సంబంధించి 148 పనులకు గానూ రూ. 2141.22 కోట్లతో, శివారులోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ పరిధిలో రూ.2993.93 కోట్లకు 267 చోట్ల పనులు చేపట్టేందుకు ప్రతిపాదించారు. ప్రభుత్వ పరిపాలన అనుమతులు రాగానే పనులు చేపట్టనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. కాగా గ్రేటర్లో వరద ముంపు సమస్యలకు శాశ్వత చెక్ పెట్టడంతో పాటు శరవేగంగా విస్తరిస్తున్న శివారులోనూ వరద ముంపు నివారణకు ప్రత్యేక దృష్టి సారించారు.
గ్రేటర్తో పోలిస్తే శివారులోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో పనులు అత్యధికంగా ఉన్నాయి. ముంపునకు గురయ్యే ఆయా ప్రాంతాల్లోని కాలనీలు, బస్తీల్లో బాక్స్డ్రైన్లు, నాలాల విస్తరణ, వరద నీటి కాలువలు నిర్మించనున్నారు.