శుక్రవారం ఓయూలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిరుద్యోగుల దీక్ష నేపథ్యంలో పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి రాకను వ్యతిరేకిస్తూ.. ఓయూలో బీఆర్ఎస్వీ నేతలు నిరసన తెలిపారు. విద్యార్థులతో రాజకీయాలు చేయవద్దని హితవు పలికారు.
ఉస్మానియా యూనివర్సిటీ, మార్చి 24: నిరుద్యోగుల దీక్ష నేపథ్యంలో ఉస్మానియా యూనివర్సిటీలో శుక్రవారం తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. ముందుస్తుగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేసి పలువురు విద్యార్థి నాయకులను అదుపులోకి తీసుకున్నారు. రేవంత్రెడ్డి వైఖరికి వ్యతిరేకంగా బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి చటారి దశరథ్ ఆధ్వర్యంలో విద్యార్థి నాయకులు దిష్టిబొమ్మను దహనం చేసేందుకు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకొని వారిని ఉస్మానియా యూనివర్సిటీ, అంబర్పేట పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా దశరథ్ మాట్లాడుతూ టీఎస్పీఎస్సీ అంశంపై ప్రభుత్వం చిత్తశుద్ధితో విచారణ జరుపుతూ, నిందితులను గుర్తిస్తూ, పేపర్ లీకైన పరీక్షలను తిరిగి పెడతామన్న హామీతో ఓయూలో నిరుద్యోగులు ధైర్యంగా చదువుకుంటున్నారని అన్నారు.
నిరుద్యోగ దీక్ష పేరుతో నిరుద్యోగులు, విద్యార్థులను రెచ్చగొట్టి విద్యార్థులతో రాజకీయాలు చేయాలని కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. విద్యార్థులు దాడులు చేస్తారనే భయంతో పిరికి పందలా హౌస్ అరెస్టు చేయించుకుని ఇంట్లో పడుకున్నాడని అన్నారు. ఓయూ విద్యార్థులు కేంద్రప్రభుత్వ ఉద్యోగాలకు కూడా అర్హులేనని, కేంద్రప్రభుత్వ సంస్థల్లో నియామకాల గురించి కాంగ్రెస్ పార్టీ ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. ఇకనైనా విద్యార్థులతో రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. లేనిపక్షంలో ఓయూలోనే కాదు రాష్ట్రంలో ఎక్కడ విద్యార్థి, నిరుద్యోగులతో రాజకీయాలు చేసినా తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు.