కళాశాలల్లో యాంటీ డ్రగ్స్ అబ్యూజ్ కమిటీల ఏర్పాటు
గంజాయి, డ్రగ్స్ రహిత క్యాంపస్ల నిర్మాణమే లక్ష్యం..
సైబరాబాద్లో డ్రగ్స్ మహమ్మారిపై సిటిజన్ పోలీసింగ్
సిటీబ్యూరో, మార్చి 31 : గంజాయి, డ్రగ్స్ నుంచి యువత, విద్యార్థులను కాపాడేందుకు సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ‘యాంటీ డ్రగ్స్ అబ్యూజ్ కమిటీ’ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఈ కమిటీల ద్వారా కళాశాలలు, క్యాంపస్ల వద్దకు గంజాయి, డ్రగ్స్ చేరకుండా యాజమాన్యాలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సంస్థలు, స్థానిక పోలీసు అధికారిని భాగస్వాములను చేస్తున్నారు. వీరందరినీ ఒక టీమ్గా ఏర్పాటు చేసి మత్తు అంతు చూసేందుకు సిటిజన్ పోలీసింగ్ సైన్యాన్ని సిద్ధం చేశారు. ఈ కమిటీల ఏర్పాటుకు మాదాపూర్ జోన్ పరిధిలో దాదాపు 148 కళాశాలలు ముందుకు వచ్చాయి. ఈ కమిటీల ఏర్పాటు పై తల్లిదండ్రులు, విద్యార్థులు, కాలేజీ యాజమాన్యాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. మత్తుకు అలవాటైన వారు దానిని నుంచి బయటపడేందుకు సహాయం కావాలంటే సైబరాబాద్ పోలీసు హెల్ప్లైన్ నెం.9492099100ను అందుబాటులోకి తీసుకువచ్చారు.
కమిటీ లక్ష్యాలు..
ఈ కమిటీ లక్ష్యం కళాశాలలు, కాలేజీ ప్రాంగణాలను మత్తు ఫ్రీ క్యాంపస్లుగా మార్చడం. మత్తుకు బానిసవుతున్న విద్యార్థులు, యువత వ్యక్తిగతంతో పాటు సమాజానికి తీవ్రంగా హాని చేస్తుంది. దీని కోసం కమిటీ వినూత్నంగా చైతన్య కార్యక్రమాలను చేపడుతుంది. ఈ కమిటీల ద్వారా ప్రతి కళాశాల, క్యాంపస్లో అందరికీ సురక్షితమైన వాతావరణం ఏర్పడే విధంగా మార్గదర్శకాలను రూపొందించింది.
విధి విధానాలు..
కమిటీలో ఉన్నవారు ముందుగా తమ ప్రాంగణంలో మత్తుకు అలవాటు పడిన విద్యార్థులు ఉన్నారా లేదా అని గుర్తిస్తారు.
మత్తుకు అలవాటు పడిన వారు ఉంటే ఆ సమాచారాన్ని యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లి, కౌన్సెలింగ్ ఇస్తుంది.
క్యాంపస్లో అనుమానాస్పదంగా వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందిస్తుంది.
స్టడీ టూర్, విహారయాత్రలు, స్పోర్ట్స్ మీట్లకు వెళ్లినప్పుడు విద్యార్థుల అలవాట్లను పసిగడుతుంది.
విద్యార్థులు కాలేజీలో చేరే సమయంలోనే మత్తు జోలికి వెళ్లకుండా ఒరియంటేషన్ తరగతులను నిర్వహిస్తుంది.
ప్రతి ఆరు నెలలకొకసారి ఒరియంటేషన్ తరగతులను ఏర్పాటు చేసి, మానసిక నిపుణులు, పోలీసుల సహాయం తీసుకుంటుంది.
ఈ కమిటీ క్యాంపస్లో జరుగుతున్న వ్యవహరాలపై ప్రిన్సిపల్కు ప్రతి 3 నెలలకొకసారి రిపోర్ట్ ఇస్తుంది.
ఈ కమిటీలో సభ్యులు…
యాంటీ డ్రగ్స్ అబ్యూజ్ కమిటీలో కళాశాల ప్రిన్సిపల్ చైర్మన్గా ఉంటారు. అందులో ఫ్యాకల్టీ మెంబర్, కాలేజీ సెక్యూరిటీ విభాగం నుంచి ఒకరు, పేరెంట్స్ కమిటీ నుంచి ఒకరు, స్థానిక పోలీస్స్టేషన్ అధికారి, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల నుంచి ఒకరు, హాస్టల్ వార్డెన్లు సభ్యులుగా ఉంటారు.
సామాజిక బాధ్యత…
యువత మత్తు బారిన పడి జీవితాన్ని పాడు చేసుకుంటున్నది. ఇది ప్రమాదకరం. అందరూ బాధ్యతగా ముందుకు వచ్చి మత్తును తరిమికొట్టాలి. అనారోగ్యంతో పాటు వారి భవిష్యత్ను చిదిమేస్తున్న గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాల జోలికి వెళ్లకుండా యువత, విద్యార్థులు కంకణం కట్టుకోవాలి. తెలిసీతెలియక మహమ్మారి ఉచ్చులో చిక్కుకున్నా వాటి నుంచి బయటపడొచ్చు. అందరూ సహకరిస్తారు. తెలిసి కూడా మత్తుకు అలవాటై… విస్తరించే ప్రయత్నం చేస్తే చట్టపరంగా చాలా కఠినంగా ఉంటాం.
– స్టీఫెన్ రవీంద్ర, పోలీసు కమిషనర్ సైబరాబాద్