అంబర్పేట, సెప్టెంబర్ 25: మూసీ నదిని అద్భుతంగా సుందరీకరించాలన్న సీఎం కేసీఆర్ కలను నెరవేరుస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. వచ్చే నెలాఖరుకల్లా 31 ఎస్టీపీలను అందుబాటులోకి తెచ్చి..రోజుకు 200 కోట్ల లీటర్ల మురుగునీటిని శుద్ధి చేసి.. స్వచ్ఛమైన నీటిని మూసీలోకి వదలనున్నట్లు చెప్పారు. సోమవారం రూ.52 కోట్ల వ్యయంతో మూసారాంబాగ్ పాత బ్రిడ్జి స్థానంలో కొత్తగా నిర్మించనున్న హైలెవల్ వంతెన పనులకు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్యాదవ్, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలతాశోభన్రెడ్డి, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్, బలాల తదితరులతో కలిసి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ గోదావరిని ఇప్పటికే కొండపోచమ్మ సాగర్ వరకు తీసుకొచ్చామని, అక్కడి నుంచి గండిపేటకు గోదావరి జలాలను తీసుకొస్తామన్నారు. మూసీపై ఓఆర్ఆర్ వెస్ట్ నుంచి ఈస్ట్ వరకు పదివేల కోట్లతో ఎక్స్ప్రెస్ వేను కూడా నిర్మించబోతున్నామని వెల్లడించారు. మరో వారం పది రోజుల్లో 40వేల డబుల్ బెడ్రూం గృహాలను అందజేస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు.
మూసారాంబాగ్ హైలెవల్ బ్రిడ్జి నిర్మాణ పనుల శంకుస్థాపనలో మంత్రులు కేటీఆర్, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్యాదవ్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, ఎమ్మెల్యేలు బలాల, కాలేరు వెంకటేశ్, మేయర్ విజయలక్ష్మి తదితరులు