హైదరాబాద్ : కరెంట్ ఆఫీస్లో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి విద్యుత్ ఉద్యోగి ఓ యువతి నుంచి రూ. 19.50 లక్షలు తీసుకొని.. నకిలీ అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చి ముఖం చాటేశాడు(Fraud). వివరాల్లోకి వెళ్తే.. నాగోల్ మమతనగర్కు చెందిన ఓ యువతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపర్ అవుతున్నది. ఈ క్రమంలో విద్యుత్ శాఖలో TGSPDCL) జూనియర్ అసిస్టెంట్గా(Electrical employee) భువనగిరిలో పనిచేస్తున్న బండారపు కిరణ్ కుమార్ ఆమెకు పరిచయమయ్యాడు.
తనకు కూడా జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం ఇప్పిస్తానని, విడతల వారీగా రూ.19.50 లక్షలు తీసుకున్నాడు. ఆపై ఉద్యోగం ఇప్పించకుండా కాలయాపన చేస్తుడడంతో ఇటీవల యువతి నిలదీసింది. దీంతో అతను అపాయింట్మెంట్ లెటర్ తీసుకొచ్చి ఇవ్వగా, అది ఫేక్ అని తేలడంతో డబ్బులు తిరిగి ఇవ్వాలని మరోసారి గట్టిగా అడగడంతో.. ఆరు నెలల్లో డబ్బులు ఇస్తానని అంగీకరించాడు. ఆరు నెలలైనా డబ్బులు ఇవ్వకపోవడంతో నాగోలు పోలీస్ స్టేషన్లో సదరు యువతి ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.