Medchal | మేడ్చల్, మే 20 (నమస్తే తెలంగాణ) : వానకాలం పంటల సాగుకు యాక్షన్ ప్లాన్ సిద్ధమైంది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో 28,585 ఎకరాలలో వివిధ పంటల సాగుకు వ్యవసాయశాఖ ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వ్యవసాయశాఖ అధికారులు వెల్లడించారు. ప్రధానంగా వరి, పత్తి, మొక్కజొన్న, జొన్న, కూరగాయలు, పండ్ల పంటలు సాగు చేసేలా రైతులను సన్నద్ధం చేస్తున్నారు. ఈ సీజన్లో వర్షాలు ముందుగానే పడుతాయనే వాతావరణ శాఖ సూచనల మేరకు పంటల సాగులో రైతులు నిమగ్నం కానున్నారు. ఇప్పటికే వరి కోతలు ముగిసినట్లు వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు.
హైదరాబాద్ నగరానికి సమీపంలో ఉన్న మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో ప్రధానంగా పండ్లు, కూరగాయల సాగు పెంచేలా రైతులను సిద్ధం చేసేలా అవగాహన కల్పిస్తున్నారు. యాక్షన్ ప్లాన్కు అనుగుణంగా పంటల సాగుకు అవసరమయ్యే ఎరువుల(ఫర్టిలైజర్స్)ను వ్యవసాయ శాఖ అందుబాటులో ఉంచింది. యూరియ 2,100మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ 2,200, డీఏపీ 1.125, ఏఓపీ 550, ఎస్ఎస్పీ 400 మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నట్లు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యవసాధికారి మేరీ రేఖ తెలిపారు.