హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తేతెలంగాణ): తెలంగాణ మీడియా అకాడమీ భవనాన్ని నవంబర్లోగా పూర్తిచేయాలని అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ సంబంధిత కాంట్రాక్టర్ను, రోడ్లు భవనాలశాఖ ఇంజినీర్లను కోరారు. బుధవారం ఆయన నాంపల్లిలో మీడియా అకాడమీ భవన నిర్మాణ పనులను పరిశీలించిన అనంతరం కాంట్రాక్టర్, ఇంజినీరింగ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అల్లం నారాయణ మాట్లాడుతూ.. ఈ భవనంలో జర్నలిస్టులకు శిక్షణా తరగతులు, సర్టిఫికెట్ కోర్సుల నిర్వహణ, లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్, వీడియో కాన్ఫరెన్సింగ్ సదుపాయాలను ఏర్పాటు చేయడంతోపాటు ఆధునిక సౌకర్యాలతో ఆడిటోరియం నిర్మిసున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మీడియా అకాడమీ కార్యదర్శి ఎమ్డీ ముర్తుజా, కాంట్రాక్టర్ నర్రా శ్రీనివాస్, రోడ్లు భవనాల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ నర్సింగరావు, డిప్యుటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ మాధవి, అసిస్టెంట్ ఇంజినీర్ నితిన్ పాల్గొన్నారు.