హైదరాబాద్ : సికింద్రాబాద్ అభివృద్ధి బీఆర్ఎస్ గెలుపతోనే సాధ్యమని సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్(MLA Talasani) అన్నారు. మంగళవారం సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని బన్సీలాల్ పేట డివిజన్ భోలక్ పూర్లో సికింద్రాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు గౌడ్తో(Padmarao goud) కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఐడీహెచ్ కాలనీలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు కోరుకునేది అభివృద్ధి, సమస్యల పరిష్కారమేనని అది బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమన్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ప్రజల విశ్వాసాన్ని కోల్పోయాయని చెప్పారు. అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని విమర్శించారు.
అలాగే సికింద్రాబాద్ పార్లమెంట్(Parliament election) నుంచి ఎంపీగా గెలిచి కేంద్రమంత్రిగా కిషన్ రెడ్డి ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టకుండా, ప్రజలకు అందుబాటులో లేకుండా ఈ నియోజకవర్గ ప్రజల నమ్మకాన్ని కోల్పోయారని పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికలలో పద్మారావు గౌడ్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు.