హైదరాబాద్ : ప్రజల సహకారంతో హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని బీఆర్ఎస్ అభ్యర్థి గడ్డం శ్రీనివాస్ యాదవ్ (Gaddam Srinivas Yadav) పేర్కొన్నారు. గోషామహల్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి మంగళవారం ఎన్నికల ప్రచారం ( Election Campaign) లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలలో చేసిన వాగ్ధానాలను అమలు చేయని కాంగ్రెస్ (Congress) పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. పాతబస్తీలో నలభై సంవత్సరాలుగా ప్రాతినిధ్యం వహిస్తూ ఎలాంటి అభివృద్ధి చేపట్టని మజ్లిస్, కేంద్రంలో అధికారంలో ఉండి పాతబస్తీకి బుడ్డ పైస విడుదల చేయని బీజేపీకి ఓటు అడిగే హక్కు లేదన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కేసీఆర్ (KCR) నాయకత్వంలో హైదరాబాద్ నగరం ఎంతగానో అభివృద్ధి జరిగిందని పేర్కొన్నారు. నగరానికి అంతర్జాతీయ ఖ్యాతి తీసుకు వచ్చిన ఘనత బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వానికే దక్కిందని తెలిపారు. ప్రజల సహకారంతో ఘన విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు రమేష్ గుప్తా, దత్తు తదితరులు పాల్గొన్నారు.