మేడ్చల్, డిసెంబర్ 23 : ప్రపంచంలో వ్యవసాయం అత్యంత కీలకమని, అతిపెద్ద పరిశ్రమ వ్యవసాయం, దాని అనుంబంధ ఉత్పత్తులేనని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ మైసమ్మగూడలోని మల్లారెడ్డి యూనివర్సిటీ వ్యవసాయ కళాశాలలో శుక్రవారం ఫార్మ్థాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజల జీవనోపాధి వ్యవసాయం, దాని అనుబంధ సంస్థలపైనే ఆధారపడి ఉందన్నారు. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన రంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని పేర్కొన్నారు. పంటల దిగుబడిని పెంచడానికి, నాణ్యమైన ఉత్పత్తులను సాధించడానికి, పర్యావరణ ప్రభావాన్ని తగ్గించేందుకు వ్యవసాయ శాస్ర్తాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను అన్ని విధాల ఆదుకుంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ భాస్కర్ యాదవ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దయానంద్ యాదవ్, మల్లారెడ్డి విశ్వ విద్యాలయం చైర్మన్ డాక్టర్ భద్రారెడ్డి, డైరెక్టర్ ప్రీతిరెడ్డి, వైస్ చాన్స్లర్ వీఎస్కే రెడ్డి, వ్యవసాయ శాఖ డీన్ డాక్టర్ రాజారెడ్డి పట్టణ అధ్యక్షుడు శేఖర్ గౌడ్, కౌన్సిలర్ చింత పెంటయ్య, తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర రైతుల గౌరవం పెరిగింది చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి
రైతుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని, రాబోవు రోజుల్లో దేశ వ్యాప్తంగా రైతులకు అండగా ఉండబోతున్నామని చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి అన్నారు. శుక్రవారం జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా రైతు నేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో రైతు ప్రోత్సాహం సదస్సును ప్రొ.జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం రైతులకు అధిక ప్రాధాన్యత ఇచ్చిందని, ప్రస్తుతం రైతులు గౌరవంగా జీవిస్తున్నారని తెలిపారు. దేశ వ్యాప్తంగా రైతు సంక్షేమ పథకాలు అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో డా.వి సుధారాణి, ఏవీపీ మెండు శ్రీనివాసులు, మహ్మద్ అలీ, వట్టి వెంకట్ పాల్గొన్నారు.